ల్యాండ్‌పూలింగ్‌పై సీఎంది ద్వంద్వ వైఖరి

ABN , First Publish Date - 2020-12-03T05:56:54+05:30 IST

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్‌పూలింగ్‌కు పూనుకోవడం ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాఽథం ఆరోపించారు.

ల్యాండ్‌పూలింగ్‌పై సీఎంది ద్వంద్వ వైఖరి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లోకనాఽథం

కబ్జాకు గురైన భూములు పేదలకు ఇవ్వాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాఽథం

విశాఖపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్‌పూలింగ్‌కు పూనుకోవడం ఆయన ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాఽథం ఆరోపించారు. జగదాంబ కూడలిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్‌పూలింగ్‌పై తమ పార్టీ మొదటి నుంచి ఒకే విధానానికి కట్టుబడి పేదలపక్షాన నిలబడితే, వైసీపీ మాత్రం రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందన్నారు. ల్యాండ్‌పూలింగ్‌పై గ్రామ సభలు నిర్వహించకుండానే సన్న, చిన్నకారు రైతులంతా ఆమోదం తెలిపారంటూ రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేయడం దారుణమని లోకనాఽథం ఆవేదన వ్యక్తంచేశారు. చేతిలో మీడియా ఉందనే భావనతో అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారని విమర్శించారు. దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న భూములను ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో బలవంతంగా లాక్కోవడం వైసీపీ విధానమా? అని ప్రశ్నించారు. పేదల సాగులో ఉన్న భూములను తీసుకుని తిరిగి పేదలకు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్‌ 72ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరించకుండా దీనికి విరుద్ధంగా భూసేకరణ చేస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతోందని ఆరోపించారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ రూరల్‌, పరవాడ, అనకాపల్లితోసహా పది మండలాల పరిధిలోని 55 గ్రామాల్లో పేదలు సాగుచేస్తున్న 6,116.50 ఎకరాలను బలవంతంగా లాక్కోవడానికి వీఎంఆర్‌డీఏ నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అయితే నష్టపరిహారం ఊసే లేకుండా కంటితుడుపు ప్యాకేజీతో సరిపెట్టేసిందని విమర్శించారు. నగరంతోపాటు జిల్లాలో కబ్జాకు గురైనట్టు సిట్‌ గుర్తించిన భూములను పేదలకు పంచిపెట్టాలని లోకనాఽథం డిమాండ్‌ చేశారు. నవరత్నాల పేరుతో సాగులో ఉన్న పేదల భూముల్ని బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌ వేశామని, దీనిపై స్పందించిన కోర్టు చట్టప్రకారం సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేసినా, ఇంతవరకూ చర్చలకు చొరవ చూపకుండా, సీపీఎం మీద నెపం వేసే యత్నం చేస్తోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:56:54+05:30 IST