అమరావతి భూముల అమ్మకం అనైతికం
ABN , First Publish Date - 2022-06-29T05:57:41+05:30 IST
అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని భూములను అమ్మాలంటూ ప్రభుత్వం జీవోలను విడుదల చేయడం అ నైతికమైన చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పేర్కొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు
గుంటూరు(తూర్పు), జూన్ 28: అమరావతి, సీఆర్డీఏ పరిధిలోని భూములను అమ్మాలంటూ ప్రభుత్వం జీవోలను విడుదల చేయడం అ నైతికమైన చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే భూముల అమ్మకం చేపట్టారని, అంతే తప్ప అమరావతి అభివృద్ధి కాదని స్పష్టం చేశారు. రైతులనుంచి సమీకరించిన భూములను ఏ ప్రాతిపదికన అమ్ముతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. తక్షణమే 389, 390 జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో సింగపూర్ కంపెనీలకు భూములను అమ్మాలని చూస్తే వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు అదే పని ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. విభజన హామీల్లో పొందుపరిచిన విధంగా అమరావతి అభివృద్ధి కేంద్రం బాధ్యతని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని, అంతేగాని భూములను అమ్మితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు కృష్ణయ్య, పాశం రామారావు, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.