75 అడుగుల జాతీయ జెండాతో సీపీఎం ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-08T06:11:43+05:30 IST

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు 75 అడుగుల జాతీయ జెండాతో ఆదివారం అనకాపల్లి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

75 అడుగుల జాతీయ జెండాతో సీపీఎం ప్రదర్శన
75 అడుగుల మువ్వెన్నల జెండాతో ప్రదర్శన

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 7 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీపీఎం, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు 75 అడుగుల జాతీయ జెండాతో ఆదివారం అనకాపల్లి పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్మిక కర్షక నిలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నెహ్రూచౌక్‌, రామచంద్ర థియేటర్‌ మీదుగా పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కె.లోకనాథం, ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృతోత్సవం పేరిట ప్రస్తుతం వేడుకలు జరుపుతుందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కనీస పాత్ర లేకపోగా, బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌ నరేంద్రమోదీ సర్కారు వీటికి ఆధ్వర్యం వహిస్తుండడం విడ్డూరమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారని, లాఠీ దెబ్బలు తిని ఉరికంబం ఎక్కారని వివరించారు. ఎందరో త్యాగాలతో ఏర్పడిన స్వాతంత్రాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఆర్‌.శంకరరావు, సీపీఎం నాయకులు గంటా శ్రీరామ్‌, జి. నాయనబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.రమణ, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:11:43+05:30 IST