ఆస్తి పన్ను పెంపు జీవోలను రద్దు చేయాలి: సీపీఎం
ABN , First Publish Date - 2020-12-03T05:40:30+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో జీవిస్తున్న ప్రజలపై ఆస్తి పన్ను పెంచుతూ విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని నంద్యాల సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
నంద్యాల, డిసెంబరు 2: రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో జీవిస్తున్న ప్రజలపై ఆస్తి పన్ను పెంచుతూ విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని నంద్యాల సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సాయిబాబానగర్ ఆర్చీ సెంటర్లో ఈ జీవో కాపీలను దహనం చేశారు. సీపీఎం పట్టణ నాయకుడు కేఎండీ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో సీపీఎం నాయకులు మస్తాన్వలి, తోట మద్దులు, నరసింహ, శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రజలపై ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్నులాంటి అనే రకాల పన్నులను వేస్తూ ఇటీవల విడుదల చేసిన జీవో నంబరులు 196, 197, 198 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మణ్, వెంకటలింగం, ఐద్వా జిల్లా కార్యదర్శి రత్నమ్మ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుసేన్బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: రాష్ట్రంలో మున్సిపల్ చట్టాలను సవరించి ప్రజలపై పన్నుల భారం వేయడం సరికాదని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పన్నులు పెంచుతూ ప్రభుత్వం విడదల చేసి ప్రతులను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో నివసించే 1.6కోట్ల మంది ప్రజలపై భారం మోపేలా ప్రభుత్వం పన్నులను పెంచుతూ జీవోనెం.196, 197, 198లను జారీ చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్నాయక్, సురేంద్ర, శివకుమార్, గణపతి, మోహన్, రసూల్ పాల్గొన్నారు.
నందికొట్కూరు: పట్టణ ప్రజలపై భారం మోపే జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండు చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చట్టాలను సవరిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 16 నంబరు ఆర్డినెన్సు ప్రకారం ప్రజలపై ఆస్తిపన్నులు, నీటి చార్జీలు డ్రైనేజీ చార్జీలను భారీగా పెంచే 196, 197, 198 జీవోలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు నాగేశ్వరరావు, జిల్లా నాయకులు భాస్కరరెడ్డి డిమాండు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.