Cpm Balakrishnan: సామాన్యులపై పన్నులు... కార్పొరేట్లకు రాయితీలా
ABN , First Publish Date - 2022-07-30T15:46:59+05:30 IST
కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి(Cpm State Secratary) కె.
- సీపీఎం ధ్వజం
పెరంబూర్(చెన్నై), జూలై 29: కార్పొరేట్లకు రాయితీలు కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి(Cpm State Secratary) కె. బాలకృష్ణన్ ధ్వజమెత్తారు. బియ్యం, గోధుమలు సహా నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. స్థానిక మొగప్పేర్ బస్టాండ్ సమీపంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న కె.బాలకృష్ణన్ మాట్లాడుతూ, బీజేపీ(BJP) ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కొత్త ఉద్యోగాలు లేవని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయన్నారు. బడాబాబుల నుంచి పన్నులు వసూలుచేయాల్సిన ప్రభుత్వం, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం వేయడం దారుణమన్నారు. పార్లమెంటు(Parliament) ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో ప్రతిపక్ష సభ్యులను మోదీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తోందని ఆరోపించారు. ప్రజా, కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణన్ జోస్యం చెప్పారు.