యువకుడి బలవన్మరణం
ABN , First Publish Date - 2021-05-07T06:57:50+05:30 IST
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం జరిగింది.
- పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం
ఎల్లారెడ్డిపేట, మే 6: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు.. గ్రామంలోని దూస రాజేశ్వరి-రఘుపతి దంపతుల పెద్ద కొడుకు జగన్నాథం(30) ఉపాధి నిమిత్తం ఐదేళ్ల కిందట దుబాయి దేశానికి వలస వెళ్లాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన జగన్నాథానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎక్కడ సంబంధం నిశ్చయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. భవనం పైఅంతస్తులోని గదికి వెళ్లిన యువకుడు ఎంతకు రాకపోవడంతో అతని తల్లి గదిలోకి వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ కిషన్రావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, అమ్మనాన్న, తమ్ముడు అందరు మంచిగా కలిసి ఉండాలని రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్ఐ కిషన్రావు వివరించారు.