పక్కా ప్రణాళికతో బ్యాంకు దోపిడీ

ABN , First Publish Date - 2020-11-27T06:03:22+05:30 IST

నడికుడి ఎస్‌బీఐ శాఖలో రూ.85లక్షలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లాలో అదుపులోకి తీసు కున్నారు.

పక్కా ప్రణాళికతో బ్యాంకు దోపిడీ
ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు (పాతచిత్రం)

పట్టించిన సీసీ కెమెరా ఫుటేజి 

నడికుడి బ్యాంకు చోరీ కేసులో పురోగతి నిందితులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడవాసులు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

 

దాచేపల్లి, మిర్యాలగూడ అర్బన్‌, నవంబరు 26: నడికుడి ఎస్‌బీఐ శాఖలో రూ.85లక్షలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లాలో అదుపులోకి తీసు కున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన కేదారి వినయ్‌రామ పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేస్తుండగా, ఇదేకాలనీకి చెందిన కేదారి ప్రసాద్‌ ఓ టీస్టాల్‌లో బాయ్‌గా పనిచేస్తున్నాడు. వరుసకు బాబాయ్‌ అబ్బాయ్‌లైన వీరిద్దరూ గతంలో  రాష్ట్రంలో పలు ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాచేపల్లి మండలంలో కొంతకాలంగా పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేస్తున్న వినయ్‌రామ నడి కుడిలోని ఎస్‌బీఐ శాఖలో దొంగతనానికి ప్రణాళిక రూపొం దించుకున్నాడు. కొన్నిరోజులు ప్రసాద్‌తో కలిసి బ్యాంకు పరి సర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన బ్యాంకుకు అధిక మొత్తంలో నగదు వచ్చిందని తెలుసుకుని అదేరోజు రాత్రి చిన్న గ్యాస్‌ సిలిండర్‌, గ్యాస్‌ కట్టర్‌తో బ్యాంకు తాళాలను తొలగించి లాకర్‌ గదిలోని ఓ పెట్టెలో ఉన్న రూ.85లక్షలు దొంగిలించారు. తాళాలు వేసిన ఇళ్లలో చేరీలకు పాల్పడ్డ సందర్భాల్లో వేలిముద్రలు, సీసీ కెమెరా పుటేజీలు, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలతో పోలీసులకు చిక్కిన వీరు గత అను భవాలను దృష్టిలో పెట్టుకుని పక్కా వ్యూహంతో వ్యవ హరిం చారని పోలీసులు నిర్ధారించారు. బ్యాంకు తాళాలను, లాకర్‌ను తొలగించే సమయంలో వేలిముద్రలు పడకుండా గ్లౌజులు ధరించారు. డాగ్‌స్క్వాడ్‌ పసిగట్టకుండా ఉండేందుకు బ్యాం కులో కారంపొడి చల్లారు. బ్యాంకులో అలారం మోగకుండా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సీసీ కెమెరాలో ఫుటేజీ నమోదు కాకుండా కేబుల్‌ను కట్‌ చేశారు. 


దోచారు.. దాచారు

నడికుడి బ్యాంకులో చోరీ చేసిన రూ.85లక్షల నగదులో రూ.45లక్షలు దాచేపల్లి మండల కేంద్రంలోని సుబ్బమ్మ హోటల్‌ సమీపంలోని శ్మశానవాటిక గోడపక్కన గోతిలో దాచిపెట్టారు. అనంతరం మిర్యాలగూడకు ఓ లారీలో వచ్చారు. మిగిలిన సొమ్మును ఇద్దరూ ఇళ్లలో దాచిపెట్టారు. గురువారం తెల్లవారుజామున నిందితుల ఇళ్లను సోదా చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. వినయ్‌రామ తన ఇంట్లో రూ.16లక్షలు, ప్రసాద్‌ ఇంటి ఎదురుగా ఉన్న బండరా ళ్లకు ప్పలో రూ.15.70లక్షల నోట్లకట్టలను పోలీసులు గుర్తించారు. మిగిలిన నగదును నిందితులు ఏం చేశారన్నది తెలియాల్సి ఉంది. పక్కా వ్యూహంతో వ్యవహరించినా బ్యాంకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు బ్యాంకులో చీటీపై రాసిఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా పోలీసులు పలువురిని విచారించారు. మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసుల సహ కారంతో   నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-11-27T06:03:22+05:30 IST