రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-11-30T03:49:36+05:30 IST
మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ దగ్గర ఏర్పాటు చేసిన విందుకు వెళుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
నవాబ్పేట, నవంబరు 29 : మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ దగ్గర ఏర్పాటు చేసిన విందుకు వెళుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చెట్ల పొద ల్లోంచి వచ్చిన జేసీబీని ఢీకొట్టి మృతి చెందిన ఘటన మండలంలోని కాకర్లపహాడ్ గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల కచెర్ల మండలం కుసుమసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుముంగలి తండాకు చెందిన మోతీలాల్(35) పర్వతాపూర్ మైసమ్మ ఆలయం వద్ద బంధువులు ఏర్పాటుచేసిన విందులో పాల్గొనేందుకు వెళుతుండగా కాకర్లపహాడ్ సమీపంలో పొలం నుంచి రోడ్డుపైకి వచ్చిన జేసీబీని మోతీలాల్ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో మోతీలాల్ కిందపడి తీవ్ర గాయా లతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ ఘటన స్థలం చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
మిడ్జిల్, నవంబరు 29 : మండల కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ గ్రామానికి చెందిన అస్పరి నాగయ్య తన ఇంటి నుంచి వ్యవసాయ పొలం వద్దకు వెళుతూ కల్వకుర్తి, జడ్చర్ల ప్రధాన రహదారి దాటుతుండగా బైక్ ఢీకొనడంతో నాగయ్యకు తీవ్రంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన నాగయ్యను చికిత్సకు 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించనున్నట్లు స్థానికులు తెలిపారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశంలో ప్రమాదాలు జరుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు
గండీడ్, నవంబరు 29 : ఇసుక అక్రమంగా తరిలిస్త్ను ట్రాక్టర్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించాలని సూచించగా ‘మా ట్రాక్టర్ను ఆపుతావ’ అంటూ ఏకంగా పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడి ఇసుక ట్రాక్టర్ను తప్పించిన సంఘటన చౌదర్పల్లిలో జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి శనివారం రాత్రి చౌదర్పల్లి గ్రామంలో రాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు రమేష్, కుర్మయ్యలను పంపినట్లు తెలిపారు. దీంతో అక్కడ రెండు ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్న బోయిని ఆంజనేయులు, బోయిని భీంశంకర్తోపాటు మరో నలుగురు వచ్చి కానిస్టేబుళ్లపైన దాడికి పాల్పడడంతో పాటు దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించారు. కానిస్టేబుల్ గుండు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఆరుగురిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.