గొంతుకోసి.. బంగారం లాక్కుని..
ABN , First Publish Date - 2021-10-27T06:24:44+05:30 IST
ఇద్దరు దుండగులు కారులో వెళుతూ వ్యక్తి గొంతు కోసి.. బంగారం లాక్కొని కారు వదిలేసి పారిపోయిన దారుణం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది.
ఇద్దరు దుండగుల హత్యాయత్నం
ప్రాణాలతో బయటపడిన బాధితుడు
ఫేస్బుక్ పరిచయంతో వివాహిత పిలిపించడమే కారణమా?
జి.కొండూరు, అక్టోబరు 26 : ఇద్దరు దుండగులు కారులో వెళుతూ వ్యక్తి గొంతు కోసి.. బంగారం లాక్కొని కారు వదిలేసి పారిపోయిన దారుణం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ మహిళతో బాధితుడి ఫేస్బుక్ పరిచయమే ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం హౌసింగ్ బోర్డుకాలనీకి చెందిన యార్లగడ్డ డేవిడ్కు, కంకిపాడుకు చెందిన ఓ వివాహితతో ఆరు మాసాల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటున్నారు. ఈనెల 25న మహిళ అతనికి ఫోన్ చేసి జమలాపురంలో ఫంక్షన్ ఉంది కలవాలని, తన సోదరుడు పికప్ చేసుకుంటాడని చెప్పడంతో తన కారులో డేవిడ్ జమలాపురం బయలుదేరాడు. మహిళ సోదరుడునని ఒక వ్యక్తి వచ్చి కారుఎక్కి మరో స్నేహితుడ్ని కారులో ఎక్కించాడు. కారు మొర్సుమల్లి - పుల్లూరు గ్రామాల మధ్య చేరుకుంటుండగా ముందు సీటులో కూర్చున్న డేవిడ్ గొంతును వెనుక ఉన్న వ్యక్తి బ్లేడుతో కోశాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న బాధితుడిని అదే కారులో కొండపల్లి శాంతినగర్ వద్ద ఉన్న బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ)లో పడేశారు. బాధితుడి వద్ద ఉన్న బంగారపు వస్తువులు లాక్కొని కారును జి.కొండూరు - చెవుటూరు బైపా్సలో వదిలేసి నిందితులు పరారయ్యారు. ప్రాణాలతో కాలువలో నుంచి ఎలాగోలా బయటపడి రోడ్డుపై వెళుతున్న ఆటోను ఆపి ఇంటికి ఫోన్ చేసి విషయం తెలపడంతో కుటుంబసభ్యులు డేవిడ్ను విజయవాడలోని ఓ ప్రయివేటు వైద్యశాలలో చేర్చారు. మైలవరం మండలంలో డేవిడ్ గొంతుకోసిన నిందితులు అతడ్ని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాలువలో పడేయడం, జి.కొండూరు మండలంలో కారును విదిలేయడంతో ఏ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఘటన ఎక్కడ జరిగిందో? ఎందుకు జరిగిందో? కావాలనే అతడ్ని హనీ ట్రాప్లోకి దింపారా? బంగారం ఇతర వ్యక్తిగత కక్షలతో దారుణానికి పాల్పడ్డారా? తెలియాలంటే బాధితుడు డేవిడ్ నోరు విప్పాలి.