చిన్నపిల్లల్ని వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2022-06-30T05:18:24+05:30 IST

చిన్నపిల్లల్ని వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే హెచ్చరించారు.

చిన్నపిల్లల్ని వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్‌ కేసులు
మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- ఆపరేషన్‌ ముస్కాన్‌-8ను విజయవంతం చేయాలి

- ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, జూన్‌ 29: చిన్నపిల్లల్ని వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూలై 1నుంచి 31 వరకు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌-8 విడత కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలైలో నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌-8 స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 0-18 సంవత్సరాల లోపు  బాలకార్మికులను కిరాణం షాప్‌, మెకానిక్‌ షాప్‌, హోటల్స్‌, తదితర వాటిల్లో పనిచేసేవారిని వెంటనే గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేసి అప్పగించాలన్నారు. బిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి స్టేట్‌ హోంకు తరలించాలన్నారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపట్టాలన్నారు. ఏ పనిలో అయినా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు కాల్‌చేసి చెప్పాలన్నారు. సిరిసిల్ల, వేములవాడలో ఒక ఎస్‌ఐ, మహిళా ఏఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల అధికారులు సమష్టిగా ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి బాలకార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌ కమటం అంజయ్య, సభ్యులు పున్నం చందర్‌, ఖాజానైమొద్దిన్‌, బాలరక్షభవన్‌ కో-ఆర్డినేటర్‌ సుచరిత, డీసీపీవో స్వర్ణలత, చైల్డ్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ త్రివేణీ, సీఐ సోమయ్య, ఎస్‌ఐ నవత పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-30T05:18:24+05:30 IST