ఈ సమావేశాల్లోనే ‘క్రిప్టో’ బిల్లు

ABN , First Publish Date - 2021-12-01T08:37:47+05:30 IST

ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీల బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది...

ఈ సమావేశాల్లోనే ‘క్రిప్టో’ బిల్లు

కేంద్ర కేబినెట్‌ ఆమోదమే తరువాయి: ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ : ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీల బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అయితే వీటిని పూర్తిగా నిషేధించకుండా వాటి కి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని అంశాలను మదింపు చేసిన తర్వాత కేంద్ర కేబినెట్‌ దీని పై నిర్ణయం తీసుకోనుంది. క్రిప్టో బిల్లును కేబినెట్‌ ఆమోదించి న వెంటనే ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌ ముందుకు వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లు రూపొందించినట్టు తెలిపారు. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను కట్టడి చేస్తూ ఆర్‌బీఐ జారీ చేసే డిజిటల్‌ కరెన్సీని మాత్రమే గుర్తించేలా ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించినట్టు తెలుస్తోంది.


నిద్రాణ ఖాతాల్లో రూ.26,697 కోట్లు : ఎటువంటి లావాదేవీలు లేని (డార్మాంట్‌) బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు మూలుగుతున్నాయి. గత ఏడాది చివరి నాటికి ఈ ఖాతాల్లోని  మొత్తం రూ.26,697 కోట్లకు చేరినట్టు ఆర్థిక మం త్రి ప్రకటించారు. గత పదేళ్లుగా ఈ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. ఇలాంటి ఖాతాలు తొమ్మిది కోట్ల వరకు ఉంటాయని అంచనా.వాణిజ్య బ్యాంకులతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోనూ ఇలాంటి నిద్రాణ ఖాతాలున్నాయి. 


‘బీమా’ల విలీనం లేదు: ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా కంపెనీలను విలీనం చేసే ప్రతిపాదనేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కే కరాడ్‌ రాజ్యసభలో ఈ విషయం చెప్పారు. దీంతో ప్రభుత్వ రంగంలోని నాలుగు సాధారణ బీమా కంపెనీలను విలీనం చేస్తారన్న వార్తలకు తెరపడింది.

Updated Date - 2021-12-01T08:37:47+05:30 IST