గర్జి వంకలో మొసలి సంచారం
ABN , First Publish Date - 2021-07-25T05:54:59+05:30 IST
సంతెకుడ్లూరు సమీపంలో గర్జి వంకలో, సమీప పంట పొలాల్లో మొసలి సంచరిస్తోంది.
ఆదోని రూరల్, జూలై24. సంతెకుడ్లూరు సమీపంలో గర్జి వంకలో, సమీప పంట పొలాల్లో మొసలి సంచరిస్తోంది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు అటువైపు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రామానికి చెందిన హెబ్బటం నారాయణప్ప, తలారి కేశమ్మ పొలాల మధ్య గర్జి వంక ప్రవహిస్తోంది. నాలుగైదు రోజులుగా మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వంకలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గర్జి వంకలో 10 అడుగుల నీరు ప్రవహిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు శనివారం పొలాలకు వెళ్లారు. గర్జివంక పక్కనే రైతులు మూకప్ప, రమేష్, సోమశేఖర్ తదితరులు పనులు చేసుకుంటుంగా అక్కడే ఉన్న వారి ఎద్దులు అరుస్తూ పరుగులు తీశాయి. దీన్ని గమనించిన రైతులు అక్కడకు వెళ్లి చూడగా గర్జి వంక పక్కనే పిచ్చి మొక్కల మధ్యలో వారికి మొసలి కనిపించింది. దూరం నుంచే వారు సెల్ ఫోన్లలో మొసలిని చిత్రీకరించారు. ఆ తరువాత ఇళ్లకు చేరుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దండోరా వేయించాం..
గర్జి వంక సమీపంలో మొసలి సంచరిస్తోందని కానిస్టెబుల్ నీలకంఠ దృష్టికి రైతులు తీసుకోచ్చారు. విషయం తెలిశాక రాత్రి 9.30 గంటల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించాము. అటువైపు వెళ్లవద్దని ప్రజలను అప్రమత్తం చేశాము.
- ఎస్ఐ విజయలక్ష్మి