చేతికొచ్చిన పంట నేలపాలు

ABN , First Publish Date - 2021-04-23T10:38:36+05:30 IST

కడప జిల్లాలో ఈదురుగాలులకు, అకాలవర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అన్నదాతలకు దాదాపు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పులివెందులలోనే బుధవారం రాత్రి 500 ఎకరాల్లో

చేతికొచ్చిన పంట నేలపాలు

కడప జిల్లాలో 6 కోట్లు నష్టం 

ఈదురుగాలులు, అకాల వర్షాలకు 550 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం 

బొప్పాయి, వరి పంటలు కూడా.. 


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

కడప జిల్లాలో ఈదురుగాలులకు, అకాలవర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అన్నదాతలకు దాదాపు రూ.6 కోట్ల మేర  నష్టం వాటిల్లింది.  పులివెందులలోనే బుధవారం రాత్రి 500 ఎకరాల్లో అరటి, 45 ఎకరాల్లో బొప్పా యి తోటలు నేలకూలాయి. దీంతో రూ.5.5 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లె తదితర మండలాల్లో బలమైన ఈదురుగాలులకు అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి.. రెండుమూడు వారాల్లో పక్వానికి రావాల్సిన అరటి గెలలు నేలకొరగడంతో వీటిని కొనేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకురారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


అలాగే  రైల్వేకోడూరు పరిధిలోని పుల్లంపేట మండలంలో 50 ఎకరాల్లో అరటి తోటలు, జమ్మలమడుగులో ఈదురుగాలులకు చాలాచోట్ల వరిపైరు నేలకొరిగింది. బద్వేలు పరిధిలో గురువారం వడగళ్ల వాన కురిసింది. దీంతో వరి ధాన్యం నేలరాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.తూర్పు గోదావరి జిల్లాలో అకాల వర్షం కురిసింది. కొన్నిచోట్ల యంత్రాలతో వరి కోతలు కోసినా ధాన్యం కల్లాల్లోనే నిలిచిపోయింది.  ప్రత్తిపాడు, జగ్గంపేటలలో   ఈదురుగాలులకు పలుచోట్ల మామిడికాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కాగా, ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని గురువారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది.  

Updated Date - 2021-04-23T10:38:36+05:30 IST