భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-11-29T05:06:40+05:30 IST
మహానంది శైవ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
మహానంది, నవంబరు 28: మహానంది శైవ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఆలయం ప్రాంగణంలోని నాగులకట్ట, ధ్వజస్తంభాల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక చివరి సోమవారం మహానందిలో మరింత భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మహానంది మండల మిత్ర మండలి ఆధ్వర్యంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని మండల వైసీపీకన్వీనర్ పాలమహేశ్వరరెడ్డి, దేవనాల శ్రీనివాసులు తెలిపారు.
డిసెంబరు 2న మహానందిలో లక్ష బిల్వార్చన: మహానంది క్షేత్రంలో కార్తీక ఆమవాస్య పురస్కరించుకొని డిసెంబరు 2న మహానందీశ్వరునికి మహారుధ్రాభిషేకం, లక్షబిల్వార్చన, 3న కామేశ్వరిదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహిస్తున్నట్లు ఆలయ వేదపండితులు రవిశంకర్ అవధాని ఆదివారం తెలిపారు.
యాగంటిలో భక్తుల సందడి
బనగానపల్లె, నవంబరు 28: యాగంటి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సోమవారం కార్తీక కడసోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఒక రోజు ముందుగానే యాగంటి క్షేత్రానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు అర్చనలు చేశారు. మహిళలు యాగంటి ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం యాగంటి బసవేశ్వరుడి, ఉమా మహేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
కడ సోమవారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: యాగంటి క్షేత్రంలో కార్తీక కడ సోమవారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన తోట బుచ్చిరెడ్డి, ఆలయ ఈవో డీఆర్కేవీప్రసాద్ ఆదివారం తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూలైన్లు, తాగునీటి వసతి, స్నానం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పట్ణణం నుంచి యాగంటికి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించినట్లు తెలిపారు.
నేడు లక్ష బిల్వార్చన పూజలు
పగిడ్యాల: కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని మండలంలోని ప్రాతకోటలో నందిశ్వర, కాశీశ్వరస్వామి, పగిడ్యాలలోని శివాలయం, నెహ్రూనగర్లోని శివాలయం వద్ద సోమవారం లక్ష బిల్వార్చన పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా ఆదివారం జ్యోస్యుల శ్రీరామచంద్రమూర్తి, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో శివతాండవం, తిల్లాన, నటనమాడినార్, శివ శివయనరాద, తదితరులు గీతాలకు ఆర్. ఎస్ భార్గవి, లాస్య, ప్రవళిక, తన్మయ్, జాహ్నవి, శ్రీనిధి నృత్య ప్రదర్శన చేశారు. అలాగే బాలా త్రిపురసుందరి నృత్యనికేతన కూచిపూడి నాట్యశాల, కాకినాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కర్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శివాష్టకమ్, శివపంచాక్షరి, మూషిక వాహన, గిరిజా కళ్యాణం తదితర గీతాలకు దేవీశ్రీ లక్ష్మీ, నిహారికరెడ్డి, హసిని, ఫణిశ్రీ, సంధ్య నృత్య ప్రదర్శన ప్రదర్శించారు.