ఐదేళ్ల కూతురిని బావిలో పడేసిన కసాయి తండ్రి.. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2022-02-15T22:53:02+05:30 IST

ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల కూతురిని స్కూటీ ఎక్కించుకుని తీసుకెళ్లాడు..

ఐదేళ్ల కూతురిని బావిలో పడేసిన కసాయి తండ్రి.. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు షాక్!

ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల కూతురిని స్కూటీ ఎక్కించుకుని తీసుకెళ్లాడు.. ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బావి వద్దకు తీసుకెళ్లాడు.. కన్న కూతురిని ఆ బావిలోకి తోసేసి వెళ్లిపోయాడు.. బావిలో నుంచి శబ్దం రావడం గమనించిన ఇద్దరు మహిళలు తమ చీరల సహాయంతో ఆ బాలికను రక్షించారు.. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.. ఆ బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు చెప్పింది విని షాకయ్యారు.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఉదయ్‌పూర్‌కు సమీపంలోని మొహల్ గ్రామంలో నివసిస్తున్న సుశీల్ రెండు పీజీలు చేశాడు. లాక్‌డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయింది. అప్పట్నుంచి అతనికి మళ్లీ ఉద్యోగం దొరకలేదు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆడపిల్లను చదివించి, కట్నం ఇచ్చి పెళ్లి చేసేంత స్థోమత లేదని సుశీల్ తరచుగా బాధపడుతుండేవాడు. ఆ కష్టాలు లేకుండా ఉండాలంటే కూతురిని చంపడమే మార్గమని నిర్ణయించుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆ బాలికను తీసుకుని బావి దగ్గరకు వెళ్లి అందులోకి తోసేశాడు. 


బావిలో శబ్దం రావడాన్ని గమనించిన ఇద్దరు మహిళలు తమ చీరలను విప్పి బావి లోపలికి విసిరి ఆ బాలికను కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుశీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆడపిల్ల వద్దనుకున్నాను కాబట్టి బావిలోకి తోసేశానని పోలీసులు ఎదుట సుశీల్ అంగీకరించాడు. కాగా, తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఆ బాలిక ఇష్టపడడం లేదు. దీంతో ఆ బాలికను ప్రస్తుతానికి చైల్డ్ హోమ్‌కు తరలించారు.  

Updated Date - 2022-02-15T22:53:02+05:30 IST