మోదీ పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో Cs somesh kumar సమావేశం
ABN , First Publish Date - 2022-07-01T00:53:00+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(narendra modi) హైదరాబాద్ పర్యటన సందర్భంగా
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(narendra modi) హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (somesh lumar) గురువారం సమీక్షించారు. ఈ సమావేశంలో పోలీసులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేస్తున్న ప్రధాని మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రధాన మంత్రి 2వ తేదీన హైదరాబాద్ చేరుకుని 4వ తేదీ ఉదయం బయలుదేరి వెళ్తారు. జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాన మంత్రితో పాటు అందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు నగరానికి రానున్నారని సీఎస్ తెలిపారు.
ప్రధాని పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీవీఐపీల పర్యటన సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ట్రాఫిక్ ను సజావుగా సాగేలా చూడాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో, అత్యంత జాగరూకతతో పని చేయాలని ఆయన సూచించారు. బహిరంగ సభ జరిగే పరేడ్ గ్రౌండ్లో బారికేడింగ్, లైటింగ్, ఇతర అన్ని ఏర్పాట్లను రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి,ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ C.V.ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమీషనర్లోకేష్ కుమార్ఇతర అధికారులు పాల్గొన్నారు.