ధరణి పోర్టల్ ను ఇతర రాష్ర్టాలు కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి
ABN , First Publish Date - 2021-10-24T19:58:14+05:30 IST
లంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ వంటి వినూత్న ప్రక్రియను ఇతర రాష్ట్రాలుకూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ వంటి వినూత్న ప్రక్రియను ఇతర రాష్ట్రాలుకూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్ వల్ల భూములకు భ ద్రత ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్ అమలులో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు.
ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై జిల్లా కలెక్టర్లు మరియు ఇతర ఉన్నతాధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ధరణి ప్రారంభించినప్పటి నుండి 10.35 లక్షలకు పైగా స్లాట్లు బుక్ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారం చేయడంలో, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ మరియు మెదక్ కలెక్టర్లు వారి అనుభవాలను ఈ సమావేశంలో వివరించారు.