ఇంటింటికీ జ్వర సర్వేను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2022-01-21T23:27:18+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం లో కోవిద్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

ఇంటింటికీ జ్వర సర్వేను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం లో కోవిద్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి జ్వర సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్ లోని హిల్ టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సి.ఎస్ మాట్లాడుతూ, కోవిడ్ మూడవ విడత తోగానీ ఓమైక్రాన్ తోగానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. 


దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తే, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టంచేశారు. ఇప్పటికే, కోటికి పైగా మెడికల్ కిట్ లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖలకు చెందిన  సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటిoటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి జ్వర సర్వే నేడు ప్రారంభమైందని, ఒక్కొక్క టీమ్ లో ఆశా, ఏ.ఎన్.ఎం, మున్సిపల్, పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కోవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారని వివరించారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రయివేటుతో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టిన ఈ ఇంటింటి జ్వర సర్వే ను నీతిఆయోగ్ కూడా  ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే విజయవంతంగా జరిగి, సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయ వంతంగా ప్రారంభమైనదని అన్నారు.ఈ సందర్బంగా, ఖైరతాబాద్ హిల్ టాప్ కాలనీలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ను సీ.ఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.

Updated Date - 2022-01-21T23:27:18+05:30 IST