సిటీ శాఖలో ఆ బదిలీలు రద్దు

ABN , First Publish Date - 2022-09-22T05:46:41+05:30 IST

వాణిజ్యపన్నులశాఖ గుంటూరు నోడల్‌ డివిజన్‌ పరిధిలో నిషేదిత సమయాల్లో చేసిన బదిలీలు రద్దయ్యాయి.

సిటీ శాఖలో ఆ బదిలీలు రద్దు

చీఫ్‌ కమిషనర్‌ ఆదేశాలు 

గుంటూరు, సెప్టెంబరు 21: వాణిజ్యపన్నులశాఖ గుంటూరు నోడల్‌ డివిజన్‌ పరిధిలో నిషేదిత సమయాల్లో చేసిన బదిలీలు రద్దయ్యాయి. నిషేదాజ్ఞలను ఉల్లంఘించి చేసిన బదిలీలను రద్దు చేస్తూ ఆ శాఖ చీఫ్‌ కమిషనర్‌ ఎమ్‌ గిరిజాశంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిషేదాజ్ఞలను ఉల్లంఘించి జరిగిన బదిలీల వ్యవహారంపై ఆ శాఖ ఫైనాన్స్‌ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గుంటూరు నోడల్‌ డివిజన్‌ పరిధిలోని గుంటూరు-1, 2, నెల్లూరు డివిజన్‌లలో ఉద్యోగులకు జూలై నెలాఖరులో బదిలీల కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే బదిలీల కౌన్సిలింగ్‌ మార్గదర్శకాల మేరకు జరగలేదని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అదే సమయంలో ఏపీ సీటీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ నాయకులు  సీటీ శాఖ చీఫ్‌ కమిషనర్‌తో పాటు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. అయితే జూలై 31వ తేదీతో బదిలీల ప్రక్రియపై నిషేదం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు గుంటూరు నోడల్‌ డివిజన్‌ పరిధిలో ఆగస్టులో నలుగురు ఏసీటీవోలు, ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ మొత్తం 8 మందిని బదిలీలు చేశారు. సెప్టెంబరులోనూ మరో 25 మంది వరకు సిబ్బందిని విజయవాడ రీజనల్‌ కార్యాలయం నుంచి తిరిగి  గుంటూరుకు ఓడీపై బదిలీ చేశారు. ఈ క్రమంలోనే అసలు బదిలీల వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీటీ శాఖ ఫైనాన్స్‌ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌ ఉత్తర్వులు జారీ చేయటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నిషేదాజ్ఞలను ఉల్లంఘించి చేసిన ఉత్తర్వులను రద్దు చేయటం ఆ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Updated Date - 2022-09-22T05:46:41+05:30 IST