మావోయిస్టు నేత... లండన్ జైల్లో మృతి

ABN , First Publish Date - 2022-04-09T21:28:27+05:30 IST

వివాదాస్పద మావోయిస్టు నేత, అత్యాచార నిందితుడు అరవింద్ బాలకృష్ణన్ ఇంగ్లండ్‌లోని ప్రిన్స్‌టన్ జైల్లో మరణించాడు. కేరళలో జన్మించిన అరవింద్ బాలకృష్ణన్, కొంతకాలం సింగపూర్‌లో ఉండి, ఆ తర్వాత సౌత్ లండన్ వెళ్లిపోయాడు.

మావోయిస్టు నేత... లండన్ జైల్లో మృతి

వివాదాస్పద మావోయిస్టు నేత, అత్యాచార నిందితుడు అరవింద్ బాలకృష్ణన్ ఇంగ్లండ్‌లోని ప్రిన్స్‌టన్ జైల్లో మరణించాడు. కేరళలో జన్మించిన అరవింద్ బాలకృష్ణన్, కొంతకాలం సింగపూర్‌లో ఉండి, ఆ తర్వాత సౌత్ లండన్ వెళ్లిపోయాడు. అక్కడ 1975లో ‘వర్కర్స్’ పేరిట ఒక మావోయిస్టు అనుబంధ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తన సిద్ధాంతాలవైపు ఎందరినో ఆకర్షితులయ్యేలా చేశాడు. ‘కామ్రేడ్ బాలా’గా గుర్తింపు పొందిన బాలకృష్ణన్ తనకు అతీంద్రియ శక్తులున్నాయని, ‘జాకీ’ అనే శక్తి ద్వారా ఎదుటివాళ్ల మనసుల్లో ఏముందో చదవగలనని నమ్మించేవాడు. తను చెప్పినట్లు వినకపోతే, ప్రకృతి విపత్తులు సృష్టిస్తానని బెదిరించేవాడు. ఇలాంటి బెదిరింపులతో తన ఫాలోవర్స్‌లో చాలా మంది మహిళలపై బాలకృష్ణన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 


అలా అత్యాచారానికి గురైన వాళ్లలో ఒక మహిళ పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆ పాపను కూడా బాలకృష్ణన్ తీవ్రంగా హింసించాడు. తన కూతురే అయినా, ఆమెను దాదాపు ముప్పై ఏళ్లపాటు తన ఇంట్లోనే ఖైదీగా ఉంచాడు. ఎలాగోలా ఆమె బందీఖానా నుంచి బయటపడింది. అయితే, బాలకృష్ణన్ నేరాలపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. అత్యాచారం, మహిళల్ని బందీలుగా ఉంచడం వంటి పలు నేరాల కింద బాలకృష్ణన్‌కు 2016లో 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఇంగ్లండ్‌కు చెందిన స్థానిక కోర్టు. దీంతో ప్రిన్స్‌టన్‌లోని హెచ్‌ఎమ్‌పీ డార్ట్‌మూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలకృష్ణన్ శుక్రవారం మరణించినట్లు జైలు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-04-09T21:28:27+05:30 IST