కష్టాల సాగు

ABN , First Publish Date - 2021-10-12T06:04:47+05:30 IST

దుక్కి దున్ని నాటిన నుంచి పంట చేతికొచ్చే వరకూ కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. పెరిగిన ఎరువుల ధరలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కుంగదీస్తున్నాయి.

కష్టాల సాగు

వరి పంటకు తెగుళ్ల బెడద

పాము పొడ, మొగి, సుడి దోమతో పంటకు చేటు 

భారీగా పెట్టుబడులు

ప్రతికూల వాతావరణంతో పోరాడుతున్న రైతులు


త్రిపురారం: దుక్కి దున్ని నాటిన నుంచి పంట చేతికొచ్చే వరకూ కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. పెరిగిన ఎరువుల ధరలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం మరింత కుంగదీస్తున్నాయి.  ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను కోలుకోలేదని దెబ్బతీస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో పంటల సాగుకు పెను సవాలుగా మారింది.                   

        

సాగర్‌ ఆయకట్టులో 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ప్రధా నంగా ప్రైవేట్‌ రకాలు 90శాతం మేర సాగులో ఉన్నాయి. కొన్ని రోజులుగా వరి పైరులో తెగుళ్ల ప్రభావం అధికమైంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు,సుడి దోమ, పాము పొడ, మొగి పురుగు వ్యాపించి పంటలను నాశనం చేస్తున్నాయి. అన్ని రకాల తెగుళ్లు ఒకేసారి వ్యాపించడంతో పంట దెబ్బతింటుందని రైతులు చెబుతు న్నారు. బ్యాక్టీరియా ఎండాకు తెగులుతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈతెగు లుతో పంటంతా ఎండి కనిపించి జీవం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల మొదటి వారం నుంచి వాతావరణంలో భారీ మా ర్పులు చోటు చేసుకున్నాయి. గాలిలో తేమ అధికంగా పాటు 35డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోత ఉండడంతో తెగుళ్ల వ్యాప్తి,ఎడ తెరిపి లేనివర్షాలు, నత్రజని ఎరువులు అధికంగా వాడటం వలన బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులుతోపైరులో వ్యాపించి నష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 


ఎన్ని మందులు పిచికారీ చేసినా.. 

వరి పైర్లకు చీడ పీడలు అధికం కావ డంతో రైతులు ఒకేసారి అధిక మొత్తంలో మందులు కలిపి పిచికారీ చేయడం ఆయకట్టులో నిత్యం కృత్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండాకు తెగులుతో పంటకు నష్టం వాటిల్లుతున్నట్లు రైతులు చెపుతున్నారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించక పోవడంతో ఆందోళనకు గురి అవుతున్నారు. పైౖరు పైకి కనిపించకుండా పాము పొడ, మొగి, సుడి దోమ  పంటను నాశనం చేస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు  పిచికారీ చేయాల్సి రావడంతో సాగు ఖర్చు భారీగా పెరిగిందని రైతులు వాపోతున్నారు. 


దిగుబడులపై ప్రభావం

వరి పొట్ట దశలో అన్ని తెగుళ్లు వ్యాపించడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మందులు వరుసగా పిచికారీ చేసినా వాతావరణ మార్పులతో  పంటలో తెగుళ్లు వ్యాప్తి తగ్గడం లేదు. పంటలో రోగ నిరోధక శక్తి పెంచి, అధిక దిగుబడినిచ్చే  పొటాష్‌ ఎరువులు మార్కెట్లో అందుబాటులో లేక పోవడంతో ఎకరాకు 20నుంచి 30 బస్తాలకు మించి దిగుబడులు రావని రైతులు  చెబుతున్నారు. అన్ని ప్రైవేట్‌ సన్న రకాలే కావడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వాతావరణంలో మార్పులను తట్టుకోలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 


నివారణ

వరి పైరులో ఎండాకు తెగులు లక్షణాలు కన్పిస్తే నత్రజని ఎరువులు వేయ డం తాత్కలికంగా నిలిపివేయాలి. కాపర్‌ ఆక్సిక్ల్టోరైడ్‌ 30గ్రా. +ప్లాంటామైసిన్‌ నాలుగు గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 

దోమ:గాలిలో అధికతేమ శాతం ఉండటం వలన సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. 

నివారణ: పొలాన్ని తరచు ఆరబెట్టాలి. కాలి బాటలు తీసి మొదలు తడిచే విధంగా మందులు పిచికారీ చేయాలి.  దోమను  పైమిట్రోజైన్‌ 0.6 గ్రా. లేదా ట్రైప్లూమెజోపైరిమ్‌ 0.48 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

పాము పొడ: పాము పొడ తెగులుకు హెక్సాకోనజోల్‌ 400మి.లీ లేదా ప్రొపికొనజోల్‌ 200మిల్లిలీటర్లు లేదా వాలిడామైసిన్‌ 500మిల్లీ లీటర్ల లేదా ట్రైప్లాక్సిస్ట్రోబిన్‌+ టెబుకొనజోల్‌ 80గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. 


వరిసాగు కష్టంగా మారింది : ఎడవెల్లి సుధాకర్‌రెడ్డి, రైతు, త్రిపురారం.

ప్రతి ఏటా ఖరీఫ్‌లో సాగుచేసిన వరి పంటకు తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండాకు తెగులు పంటను బాగా దెబ్బ తీసింది. ఎన్నిమందులు పిచికారీ చేసినా పెట్టుబడులు పెరిగి పోతున్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. వాతావ రణం పంటల సాగుకు అనుకూలంగా ఉండటం లేదు. దిగుబడులు  తక్కువగా వస్తున్నాయి. వరి సాగులో లాభం లేకుండా పోయింది. 



వాతావరణంలో మార్పులే కారణం : డాక్టర్‌ శంకర్‌, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, కంపసాగర్‌. 

వాతావరణ మార్పులతోనే వరిలో తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. ప్రస్తుతం బ్యాక్టీరియా ఎండాకు తెగులు వరిలో ఉధృతమైంది. ఎడతెరిపి లేకుండా గాలులతో కూడిన వర్షాలు, తెగులు ఆశించిన తరువాత నత్రజని ఎరువులు అధికంగా వాడడంతో ఎండాకు తెగులు వ్యాపిస్తోంది. 


Updated Date - 2021-10-12T06:04:47+05:30 IST