Delhiలో పెరిగిన కొవిడ్ కేసులు...కట్టడికి కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2022-04-26T14:48:34+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది....

Delhiలో పెరిగిన కొవిడ్ కేసులు...కట్టడికి కఠిన ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఒక్క సోమవారం రోజే 1011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో కలవరం నెలకొంది.ఢిల్లీలో కేవలం 14 రోజుల్లోనే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 601 నుంచి 4,168కి పెరిగింది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.42 శాతానికి పెరిగింది. ఢిల్లీలో ఒక కరోనా రోగి మృతి చెందారు.ఆరోగ్య శాఖ డేటా ప్రకారం ఢిల్లీ నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 11న 601 నుంచి ఏప్రిల్ 25 నాటికి 4,168కి పెరిగింది. ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగుల సంఖ్య తక్కువగా ఉంది. కేవలం 90 మంది రోగులు కరోనాతో ఆసుపత్రుల్లో చేరారు. 3,067 మంది కరోనా రోగులు హోం ఐసోలేషన్ లో కోలుకుంటున్నారు.


దేశ రాజధానిలో అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నాల్గవ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో కరోనా కట్టడి కోసం ఢిల్లీలో కఠిన ఆంక్షలు విధించాలని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు.అవసరమైతే పాక్షికంగా కరోనా కర్ఫ్యూ కూడా విధించాలని ఢిల్లీ అధికారులు యోచిస్తున్నారు.


Updated Date - 2022-04-26T14:48:34+05:30 IST