గోవాలో 15 రోజులు కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-08T00:21:20+05:30 IST

కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నెల 9 నుంచి గోవాలో 15 రోజుల పాటు కర్ఫ్యూ విధించనున్నట్టు గోవా ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది..

గోవాలో 15 రోజులు కర్ఫ్యూ

పనాజీ: కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నెల 9 నుంచి 15 రోజుల పాటు గోవాలో కర్ఫ్యూ విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులకు కొవిడ్-19 నెగిటివ్ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. కర్ఫ్యూ సమయంలో కిరాణా దుకాణాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తెరిచివుంచాలనీ... ఫార్మసీలు, ఇతర వైద్య సదుపాయాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలను ప్రజలు పదే పదే ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు. ‘‘కేవలం 25 శాతం మంది ప్రజలు మాత్రమే ఇళ్ల నుంచి బయటికి రావాలి. కానీ ఇప్పుడు ప్రజలు అవసరం ఉన్నా లేకుండా బయట తిరుగుతూ కనిపిస్తున్నారు..’’ అని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకురావాలని సీఎం సావంత్ సూచించారు. కర్ఫ్యూ సమయంలో వివాహాది శుభాకార్యాలన్నీ రద్దు చేసుకోవాలనీ.. వీటి వల్ల వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కాగా గోవాలో గురువారం 3,869 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 58 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2021-05-08T00:21:20+05:30 IST