కరెంట్.. కట్కట
ABN , First Publish Date - 2022-05-27T09:21:44+05:30 IST
కరెంట్.. కట్కట
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అప్రకటిత కోతలు
గంటల కొద్దీ సరఫరా బంద్.. రోడ్లపైకి ప్రజలు
వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో బాలింతల అవస్థలు
చీర కొంగులతో చిన్నారులను సేదతీర్చిన వైనం
తెనాలి మండలంలో జనం సబ్స్టేషన్ ముట్టడి
గంటల కొద్డీ కరెంట్ కట్. ప్రభుత్వాస్పత్రిలోనేమో జనరేటర్ లేదు. దోమలు, ఉక్కపోత మధ్య చీకట్లో బాలింతలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు విసనకర్రలతో రోడ్లపైకి వచ్చారు.
తెనాలి రూరల్/ వినుకొండ టౌన్, మే 26: గంటల కొద్డీ కరెంట్ కట్. ప్రభుత్వాస్పత్రిలోనేమో జనరేటర్ లేదు. దోమలు, ఉక్కపోత మధ్య చీకట్లో బాలింతలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సబ్ స్టేషన్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలతో జనం పడ్డ ఇబ్బందులు ఇవి. వినుకొండలో బుధవారం రాత్రి 10.22 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్ లేకపోవడంతో రోగులు అల్లాడిపోయారు. దోమలు, ఉక్కపోత మధ్య బాలింతలు చిన్నారులకు కొంగులతో విసురుతూ కనిపించారు. ఈ విషయంపై వైద్యాధికారి బుచ్చిబాబును వివరణ కోరగా జనరేటర్, ఇన్వర్టర్లకు మరమ్మతులు చేయించామన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో కూడా బుధవారం రాత్రి కరెంటు లేదు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో రాత్రి సుమారు 10.30 గంటలకు పోయిన కరెంట్ గురువారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చినరావూరు సబ్స్టేషన్ను జనం ముట్టడించారు. 2500 మెగావాట్ల విద్యుత్ సరఫరా కాస్తా.. 600 మెగావాట్లకు పడిపోవడంతో నిలుపుదల చేయకతప్పలేదని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.