వరద బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం : అఖిలపక్షం
ABN , First Publish Date - 2020-11-30T05:00:33+05:30 IST
వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు దారుణమని అఖిలపక్ష నేతలు నిప్పులు చెరిగారు.
కడప(మారుతీనగర్), నవంబరు 29: వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు దారుణమని అఖిలపక్ష నేతలు నిప్పులు చెరిగారు. ఉన్నఫలంగా బుగ్గవంక డ్యాం నుంచి నీటిని వదలడం, బుగ్గవంక రక్షణ గోడలు పూర్తికాకుండా సినిమా థియేటర్లు అడ్డంకిగా ఉండడం వల్లే వరదనీరు కిందికి వెళ్లకుండా నగరం జలమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు అమీర్బాబు, హరిప్రసాద్ (టీడీపీ), జి.ఈశ్యరయ్య (సీపీఐ), నీలిశ్రీనివాసులు (కాంగ్రెస్), ఎన్.రవిశంకర్రెడ్డి (ఆర్సీపీ), జగదీష్ (సీపీఎం), ఓబయ్య (సీపీఐ ఎంఎల్ లిబరేషన్), సయ్యద్ సలావుద్దీన్ (సంఘ సేవకుడు), శ్రీక్రిష్ణ (లోక్సత్తా) తదితరులు హాజరై మాట్లాడారు. వెంటనే ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నగదు, నిత్యావసర వస్తువులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు చంద్ర, నాగసుబ్బారెడ్డి, సి.ఆర్.వి.ప్రసాద్, ఆమూరి బాలదాసు, బాదుల్లా, మునెయ్యతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు.