ఆంధ్రప్రదేశ్,ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు Jawad తుపాన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-02T13:05:31+05:30 IST

భారత వాతావరణశాఖ గురువారం జవాద్ తుపాన్ హెచ్చరిక జారీ చేసింది....

ఆంధ్రప్రదేశ్,ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు Jawad తుపాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత వాతావరణశాఖ గురువారం జవాద్ తుపాన్ హెచ్చరిక జారీ చేసింది.జవాద్ తుపాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 4వతేదీన తుపాన్ ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని, దీనివల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రైతులు పొలాల్లో ఉన్న మొక్కజొన్నను కోయాలని బెంగాల్ సర్కారు సూచించింది. కోల్‌కతా, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ, నదియాతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డిసెంబర్ 4,5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


దక్షిణ థాయ్‌లాండ్‌లోని అల్పపీడనం క్రమంగా బలాన్ని పుంజుకుని తీవ్ర తుపానుగా ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం ఒడిశా, ఆంధ్రా తీరాల మధ్య తీరం దాటే ముందు దక్షిణ అండమాన్ సముద్రం గుండా భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.తుపాన్ వల్ల బంగాళాఖాతం తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం ఉదయం కోస్తా తీరంలో గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 


మత్స్యకారులు శుక్రవారం నుంచి ఆదివారం వరకు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో ఉన్నవారు గురువారం సాయంత్రంలోగా తిరిగి రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తుపాను కదలికలను నిశితంగా గమనిస్తోందని, జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధంగా ఉండాలని కోరామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


Updated Date - 2021-12-02T13:05:31+05:30 IST