దళితబంధుకు పైరవీల జోరు!

ABN , First Publish Date - 2022-09-23T05:51:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బం ధు’ పథకానికి జిల్లాలో పైరవీలు జోరందుకున్నాయి. రెండో విడత దళితబంధుకు గైడ్‌లైన్స్‌ ఇంకా విడుదల కాకముందే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు మంజూరు చేయ నుండడంతో ఎక్కువమంది అవకాశం కోసం చూస్తున్నారు.

దళితబంధుకు పైరవీల జోరు!

దళిత బంధు గైడ్‌లైన్స్‌ విడుదలకు ముందే జోరుగా పైరవీలు

రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే బేరసారాలు

యూనిట్లు మంజూరు చేయిస్తామని గ్రామస్థాయిలో ఒప్పందాలు

జిల్లాలో కొంతమంది కిందిస్థాయి నేతల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘దందా’

నిజామాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దళిత బం ధు’ పథకానికి జిల్లాలో పైరవీలు జోరందుకున్నాయి. రెండో విడత దళితబంధుకు గైడ్‌లైన్స్‌ ఇంకా విడుదల కాకముందే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు మంజూరు చేయ నుండడంతో ఎక్కువమంది అవకాశం కోసం చూస్తున్నారు. ఎవరికివారే సిఫారసులు చేయించుకుంటూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నేతల ద్వారా ఎమ్మెల్యేలను కలుస్తూ పైరవీలను చేస్తున్నారు. ఇదే ఆసరాగా కొంతమం ది కిందిస్థాయి నేతలు రింగ్‌గా ఏర్పడి పైరవీలకు తెర తీస్తున్నారు. తమకు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు ఇస్తే దళితబంధు మంజూరు చేయిస్తామని ఆశ చూపుతున్నారు. ప్రాసెసింగ్‌ పేరిట కొంత డబ్బులను వసూలు చేస్తున్నారు. 

మొదటి విడత నియోజకవర్గానికి వంద

జిల్లాలో మొదటి విడత నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిధులు జిల్లాకు రూ.55కోట్లు మంజూరు కావడంతో ఆరు నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను మంజూరు చేశారు. మొదటి విడత దళితబంధు పూర్తికావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద నియోజకవర్గానికి 1500 చొప్పున యూనిట్లను ప్రభుత్వం దళితబంధును మంజూరు చేసింది. మొదటి విడత కింద నియోజకవర్గంలో 500 మంది చొప్పున ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది. దళితబంధు కింద ఎంపికైన వారికి ఉన్న శిక్షణ ఆధారంగా ఆయా యూనిట్లలో మరింత శాస్త్రీయమైన శిక్షణను అందించడంతో పాటు యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగేవిధంగా ప్రోత్సహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడత కింద భారీగా ఎంపికయ్యే అవకాశం ఉండడం, ఆరు నియోజకవర్గాల పరిధిలో రూ.825 కోట్ల వరకు ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశం ఉండడంతో సక్రమంగా వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున..

దళితబంధు కింద ఈ యేడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉండడంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువమంది దళితులు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల వారీగా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గైడ్‌లైన్స్‌ విడుదల కాగానే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా తీసుకుని అధికార పార్టీకి చెందిన కిందిస్థాయి నేతలు పైరవీలకు తెరతీశారు. రెండో విడత గైడ్‌లైన్స్‌ పూర్తికాగానే ఆ సిఫారసులను ఎమ్మెల్యేలకు ఇచ్చి మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతున్నారు. రెండో విడత అర్హుల ఎంపిక ఏ క్షణమైనా ప్రారంభం అవుతుందని ప్రచారం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు మొదలుపెట్టారు. మొదటి విడతలో తాము చెప్పిన వారికే లిస్ట్‌లో పేరు దక్కిందని చెప్పి రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే వసూళ్లకు తెరతీస్తున్నారు. రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందనే ఆశతో కొందరు అడిగిన మొత్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. దళితబంధుకు కింద లబ్ధిదారుల ఎంపిక అయితే 10లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది దీనికి మొగ్గుచూపుతున్నారు. దళితబంధు మంజూరైన తర్వాత డబ్బులు ఇచ్చేవిధంగా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాగితాలను కూడా తమకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా రాయించుకుంటున్నారు. దళితబంధు కింద ఎంపికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసే అవకాశం ఉండడం, ఆయా గ్రామాల్లో కొంతమందిని తప్పనిసరిగా ఎంపికచేయనుండడంతో ఇదే అదనుగా కిందిస్థాయి నేతలు ఈ పైరవీలకు తెరలేపారు. పైస్థాయి నేతలకు తెలియకుండానే ఈ ఒప్పందాలను కొనసాగిస్తున్నారు. 

రాజకీయ నేతలే ఎంపిక

దళితబంధు ఎంపిక కింద అధికారుల ప్రమేయం తక్కువగా ఉండడం, రాజకీయ నేతలే ఎంపిక చేస్తుండడంతో గ్రామీణస్థాయిలో వారు కొంతమంది ఈ ‘దందా’కు తెర లేపుతున్నారు. రెండో విడతపై ఆశ పెట్టుకున్న దళితులతో ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు జరుపుతున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఈ దళితబంధు కింద ఖర్చుచేస్తున్నందున నిబంధనలు కూడా కఠినతరం చేసి ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ఎంపికలు నిర్వహిస్తే పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రజావాణికి వచ్చి దళితబంధు మంజూరు చేయాలని కొన్ని నెలలుగా అధికారులకు దరఖాస్తు చేస్తున్నారు. దళితబంధు రెండో విడత మంజూరుకు ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ వెలువడే ఈ సమయంలో ఎమ్మెల్యేలు కూడా పైరవీలపై దృష్టిసారించి గ్రామీణ ప్రాంతంలో అర్హులైన వారిని ఎంపిక చేస్తే వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-23T05:51:59+05:30 IST