UP: ప్రాణాలతో పోరాడి ఓడిన యూపీ అత్యాచార బాధిత బాలిక
ABN , First Publish Date - 2022-09-19T22:01:36+05:30 IST
యూపీలో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా
లక్నో: యూపీలో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల పిలిభిత్ (Pilibhit) జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలిక ప్రాణాలతో పోరాడుతూ కన్నుమూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కున్వర్పూర్ గ్రామం (Kunwarpur village)లో టీనేజ్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు.
తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. 12 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె తాజా మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇటీవల యూపీ (UP)లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో జరిగిన జంట హత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పెళ్లికి నిరాకరించారన్న కోపంతో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికను అపహరించిన ఇద్దరు యువకులు వారిని గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారిని చెట్టుకు వేలాడదీశారు. విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తమకు న్యాయం జరిగేంత వరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదని బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ జరిపి నిందితులకు శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చింది. దీంతో వారు ఆందోళన విరమించారు.
మరోవైపు, ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో సుహైల్, జునైద్, హఫీజుల్ రెహ్మాన్, కరీముద్దీన్, అరిఫ్తోపాటు వారికి బాలికలను పరిచయం చేసిన చోటూ అనే మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతున్న జునైద్ కాలిపై కాల్చి పట్టుకున్నారు.