
తొందరగా డబ్బు పంపాలంటూ డీజీపీ వాట్సాప్ డీపీతో సందేశాలు
మహేందర్ రెడ్డి దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు
సైబర్ క్రైంను విచారణకు ఆదేశించిన డీజీపీ
డబ్బు కోసం పలువురికి సందేశాలు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మాయమాటలు చెప్పి అమాయకులను సులువుగా బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు.. పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసు బాస్ను టార్గెట్ చేశారు. ఒక వాట్సాప్ నంబర్కు డీజీపీ మహేందర్రెడ్డి ఫొటోను డీపీగా పెట్టి ఏకంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులకే సందేశాలు పంపించారు. ‘అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది. తొందరగా పంపండి. కొద్ది రోజుల్లో తిరిగి పంపిస్తా’ అంటూ మేసేజ్లు చేశారు.
ఈ విషయాన్ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం డీజీపీ మహేందర్రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన ఆయన.. ఎవరూ డబ్బులు పంపించవద్దని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డీజీపీ మహేందర్రెడ్డి పేరుతో ఫేస్బుక్, ట్విటర్, తదితర సోషల్ మీడియా ఖాతాలున్నాయి. అందులో పోలీసు శాఖకు సంబంధించిన విషయాలను ఆయన పోస్టు చేస్తుంటారు. ఆ ఖాతాల్లో ఉన్న ఫొటోను డౌన్లోడ్ చేసుకుని.. ఒక వాట్సాప్ నంబర్కు డీపీగా సైబర్ నేరగాళ్లు పెట్టారు. అలాగే, పోలీసు శాఖకు చెందిన వెబ్సైట్లలో ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లను సేకరించి సందేశాలు పంపించారు.