యువ శాస్త్రవేత్తగా దండూరి కోటిరెడ్డి
ABN , First Publish Date - 2022-06-29T04:28:14+05:30 IST
గ్రామీణ ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి యువ శాస్త్రవేత్తగా రాయచోటికి చెందిన దండూరి కోటిరెడ్డి ఎంపికయ్యారు.
జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు
రాయచోటి టౌన్, జూన్ 28: గ్రామీణ ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి యువ శాస్త్రవేత్తగా రాయచోటికి చెందిన దండూరి కోటిరెడ్డి ఎంపికయ్యారు. రాయచోటి మండలం వరిగ పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన దండూరి అమరనాథరెడ్డి, రాణెమ్మల కుమారుడు కోటిరెడ్డి ఎలక్ర్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ర్టానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) సంస్థలో యువ శాస్త్రవేత్తల కోసం ఇటీవల నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాంకేతికరంగంలో దేశాభివృద్ధి కోసం శాస్త్రవేత్తగా సేవలందించాలని చిన్నతనం నుంచి కోరిక ఉండేదని, దానికి అనుగుణంగా ఇప్పుడు కలిగిన అవకాశంతో ఎలక్ర్టానిక్స్ రంగంలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో రైతులుగా తమ తల్లిదండ్రులు పడే కష్టం వ్యర్థం కాకుండా దానికి అనుగుణంగా చదివానన్నారు. అఖిల భారత స్థాయిలో సమీర్ సంస్థ ఆధ్వర్యంలో 5 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేయగా అందులో మన తెలుగు విద్యార్థి ఉండడం తమకెంతో గర్వకారణంగా ఉందని అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తున్నారు.