డేంజర్
ABN , First Publish Date - 2021-02-28T06:06:40+05:30 IST
డేంజర్
- కంచెలేని ట్రాన్స్ఫార్మర్లతో పొంచి ఉన్న ప్రమాదం
- ఇళ్లపైనే ఎల్టీలైన్లు..
- చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలు
- విద్యుత్ చౌర్యంతో కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు
- భయం గుప్పిట్లో ప్రజలు..
- పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
యాచారం మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ వ్యవస అస్తవ్యస్తంగా మారింది. ఏ గ్రామంలో చూసినా కంచె లేని ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న విద్యుత్ తీగలే దర్శనమిస్తున్నాయి. రోడ్ల పక్కనే ట్రాన్స్ఫార్మర్లున్నా వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో ట్రాన్స్కో అధికారులు విఫలమవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన ఆశాఖ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
యాచారం/చేవెళ్ల: యాచారం మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కంచెలేని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లే దర్శనమిస్తున్నాయి. తరుచు ట్రాన్స్ఫార్మర్లవద్ద ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మేతకు వెళ్లిన పశువులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల నజ్దిక్సింగారంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద షాక్కుగురై వరప్రసాద్రెడ్డికి చెందిన ఆవు మృత్యువాత పడింది. మొండిగౌరెల్లిలో ఎద్దు మృతి చెం దింది. నానక్నగర్, మేడిపల్లి, తాడిపర్తి, కుర్మిద్ద, గున్గల్, చిన్నతూండ్ల, నజ్దిక్సింగారం తదితర గ్రామాల్లో ఇళ్ల మధ్యనే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ తదితర మండలాల్లోని గ్రామాల్లో మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. చేవెళ్ల పట్టణంలో జనవాసాల మధ్య కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తున్నాయి.
పగలే విద్యుత్ వెలుగులు
యాచారం మండలం నజ్దిక్సింగారం, తాడిపర్తి, చిన్నతూండ్ల, కొత్తపల్లి, కుర్మిద్ద, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో పగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఇదిలా ఉంటే తమ్మలోనిగూడలో 20 స్తంభాలకు లైట్లు బిగించకపోవడంతో వీధు ల్లో రాత్రిపూట అంధకారం నెలకొంది. పలు గ్రామాల్లో ఎల్టీ లైన్లు, 11కేవీ విద్యుత్తీగలు వేలాడుతున్నా వాటిని సరిచేయడం లేదు. కొత్తపల్లి, నందివనపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాలతో పాటు వ్యవసాయ బావుల వద్ద ఎల్టీలైన్లు చేతికందే ఎత్తులో ఉన్నాయి. చౌదర్పల్లి, గున్గల్, నానక్నగర్, నజ్దిక్సింగారం, తాడిపర్తి, కుర్మిద్ద, తమ్మలోనిగూడ, చిన్నతూండ్ల తదితర గ్రామాల్లో విద్యుత్ చౌర్యం కారణంగా నిత్యం ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు కాలిపోతున్నాయి.
కంచె ఏర్పాటు చేయాలి : మాధవ్గౌడ్, కమ్మెట గ్రామస్థుడు
గ్రామాల్లో ఎక్కడ చూసినా విద్ముత్ ట్రాన్స్ఫార్మర్లు దర్శనం ఇస్తున్నాయి. వాటి చుట్టూ కంచెలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఉన్నత స్థాయి అఽధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు : సీతారాములు, ఏఈ, యాచారం
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవు. గామాల్లో వేలాడతున్న ఎల్టీ లైన్లను సరి చేస్తాం. లైన్ తీయాలంటే స్తంభంతో పాటు మెటీరియల్ కావాలి. దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తాం.