ఆదమరిస్తే గల్లంతే
ABN , First Publish Date - 2022-07-04T06:36:06+05:30 IST
మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి వర్షాకాలం వస్తుందంటే చాలు వెన్నులో వణుకే. ఆ గ్రామంలో దాదాపు అన్నీ గిరిజన కుటుంబాలే
ప్రమాదకరంగా ఎల్చిరెడ్డిపల్లి రహదారి
మరమ్మతులు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
పినపాక, జూలై 3: మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి వర్షాకాలం వస్తుందంటే చాలు వెన్నులో వణుకే. ఆ గ్రామంలో దాదాపు అన్నీ గిరిజన కుటుంబాలే. 50 ఏళ్లకు పైబడే ఇక్కడ నివసిస్తున్నారు. మూడు వైపులా దారులు మూసుకుపోయి నడక, రవాణా, ఏ ప్రయాణం సాగించాలన్నా తలకు మించిన ప్రయాసే. ఈ గ్రామానికి రెండు వైపులా ప్రవహించే పెద్దవాగు వర్షాకాలంలో ఉధృత రూపం దాల్చుతుంది. మరో వైపు అభయారణ్య భూమి ఉండడంతో వారికి ఇక మిగిలింది ఒకటే దారి. అది కూడా పెదవాగు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. నిత్యం ఈ దారిలో రాకపోకలు సాగించాలంటే అరచేత ప్రాణాలు పట్టుకుని వెళ్లాల్సిందే. గత ఏడాది వర్షాకాలం దెబ్బతిన్న ఈ రోడ్డును బాగుచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ మార్గంలో నిత్యం రోజు వారీ పని చేసుకుని జీవించే కూలీలతో పాటు, ఇటు నుంచి వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉండడమే గాక దీనికి కూతవేటు దూరంలో కస్తూర్బా పాఠశాల, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు కూడా ఉన్నాయి.