ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-04-04T21:53:32+05:30 IST
సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని తప్పుబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సరిదిద్దుతామని ప్రకటించారు. కరెంట్ ఎందుకు పోతుందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలి? అని ప్రశ్నించారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనపై ఆయన సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదని తెలిపారు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు. సామాజిక సమతూకం పాటించకుండా పదవులు, పోస్టింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ విధానాలపై ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో అక్రమ మద్యంతో వేల కోట్లు జగన్ ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ షాపుల ద్వారానే నెంబర్ 2 మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. కల్తీమద్యం, జె-ట్యాక్స్పై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు ప్రకటించారు.