కరోనాతో 10 మంది మావోయిస్టుల మృతి..?
ABN , First Publish Date - 2021-05-11T18:12:50+05:30 IST
ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో అజ్ఞాతంలో ఉన్న 10 మందికి పైగా మావోయిస్టులు కరోనా..
దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న 10 మందికి పైగా మావోయిస్టులు కరోనా, కలుషితాహారం బారిన పడి మరణించినట్టు తెలుస్తోందని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని మావోయిస్టులు ఇంకా ధ్రువీకరించ లేదు. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ మీడియాతో మాట్లాడుతూ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పలువురు మావోయిస్టు నేతలు కోవిడ్, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని చెప్పారు. దండకారణ్య ప్రత్యేక జనల్ కమిటీ (డీకేఎస్జీసీ) సభ్యురాలు సుజాత తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడిందని, శ్వాస సమస్యతో కదలలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. మావోయిస్టుల ప్రాణాలకు రిస్క్ ఉండటమే కాకుండా కరోనా వ్యాప్తితో గ్రామస్థుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని అన్నారు. గడువుతీరిన ఆహారం తీసుకోవడం వల్ల మరికొందరు మావోయిస్టులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడినట్టు తెలుస్తోందన్నారు. పోలీసులకు లొంగిపోతే వారికి వైద్య చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పల్లవ్ విజ్ఞప్తి చేశారు.