శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

ABN , First Publish Date - 2022-09-24T06:49:44+05:30 IST

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగ కార్యాలయం నుంచి శుక్రవారం డీఎ్‌ఫవో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకెళ్లారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగ కార్యాలయం నుంచి శుక్రవారం డీఎ్‌ఫవో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈనెలా 27వ తేదీన జరిగే ధ్వజారోహణంలో వీటిని వినియోగించనున్నారు. 

ధ్వజారోహణానికి చాప, తాడు కీలకం

బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈసందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడపతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేదమంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పైవరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణుదర్భను వినియోగిస్తారు. దీనికోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీశాఖ సిబ్బంది సేకరించారు. దర్భను తిరుమలకు తీసుకొచ్చి తక్కువ ఎండలో వారంరోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచిన తర్వాత చాప, తాడును తయారు చేశారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసి శుక్రవారం ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రేంజ్‌ అధికారి వెంకటసుబ్బయ్య, డిప్యూటీ రేంజ్‌ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-24T06:49:44+05:30 IST