దర్భంగ పేలుడు కేసు.. కశ్మీరీ వ్యాపారి అరెస్టు

ABN , First Publish Date - 2021-07-26T08:22:33+05:30 IST

దర్భంగ రైల్వే స్టేషన్‌ పార్సిల్‌ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది.

దర్భంగ పేలుడు కేసు.. కశ్మీరీ వ్యాపారి అరెస్టు

 తెరపైకి మరికొందరి పేర్లు.. 17 మందిని విచారించిన ఎన్‌ఐఏ


హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): దర్భంగ రైల్వే స్టేషన్‌ పార్సిల్‌ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఇజార్‌ అలియాస్‌ సోనును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. అతడి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ షామ్లీ జిల్లాలోని కంద్లా. కశ్మీర్‌కు వలస వెళ్లిన ఇజార్‌.. తన సోదరుడు నూర్‌ మహమ్మద్‌తో కలిసి పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అతడు కొద్ది రోజుల క్రితమే తన స్వస్థలం కంద్లాకు వచ్చాడు. దర్భంగ పేలుడు మాస్టర్‌మైండ్‌, ప్రస్తుతం పాక్‌లో ఉంటున్న ఇక్బాల్‌ ఖానాతో ఇజార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఇజార్‌ వద్ద పనిచేసే జహంగీర్‌కు దర్భంగ పేలుడుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించి, అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. జహంగీర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తులో భాగంగా 17 మందిని విచారించినట్లు పట్నా కోర్టుకు ఎన్‌ఐఏ నివేదించింది.

Updated Date - 2021-07-26T08:22:33+05:30 IST