మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం

ABN , First Publish Date - 2022-10-07T05:46:43+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో విజయదశమి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. శ్రీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఆశ్వయుజ శుద్ధ దశమి సందర్భంగా రాజరాజేశ్వరీ అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
వేములవాడలో గజవాహనంపై స్వామివారి ఊరేగింపు

-  వేములవాడలో గజవాహనంపై స్వామివారి ఊరేగింపు

- ముగిసిన దసరా ఉత్సవాలు

వేములవాడ, అక్టోబరు 6: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో విజయదశమి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. శ్రీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం ఆశ్వయుజ శుద్ధ దశమి సందర్భంగా రాజరాజేశ్వరీ అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు, బ్రాహ్మణులు ఉదయం తొలుత రాజరాజేశ్వరీదేవీ అమ్మవారికి మహాభిషేకము, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ నిర్వహించారు. తదుపరి ఆయుధ పూజ చేశారు. సాయంత్రం ధ్వజారోహణం అనంతరం శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిని మహాలక్ష్మి (పాలవెల్లి) అవతారంతో అలంకరించారు. అనంతరం గజవాహనంపై శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మి అనంతపద్మనాభస్వామివారి ఉత్సవ మూర్తులను అలంకరించి అపరాజిత పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గజ వాహనంపై శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మి అనంతపద్మనాభస్వామివారి ఉత్సవమూర్తుల ఆలయ ఆవరణలో ఊరేగించిన అనంతరం పట్టణంలోని మహాలక్ష్మీ దేవాలయం వద్ద గల శమీవృక్షం వరకు శమీయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళహారతులతో స్వామివారి పెద్ద సేవకు స్వాగతం పలికారు. పురప్రముఖులు, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, దసరా సందర్భంగా కులమతాలకు అతీతంగా వేలాది మంది ప్రజలు బంగారం (జమ్మి ఆకు) ఇచ్చిపుచ్చుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాజన్న ఆలయ మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ ఓ.వెంకటేశ్‌ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు దసరా ఉత్సవాల్లో ఆనందోత్సాహాలతో పాలుపంచుకున్నారు. దసరా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామివారిని, మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య దసరా పర్వదినం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. 


Updated Date - 2022-10-07T05:46:43+05:30 IST