నలుదిక్కులా.. నలుగురు..
ABN , First Publish Date - 2022-10-02T06:00:09+05:30 IST
నలుదిక్కులా.. నలుగురు..
మంత్రి, కలెక్టర్, సీపీ, జేసీ నిరంతర పర్యవేక్షణ
కొండపై నాలుగు చోట్ల ప్రత్యక్ష పరిశీలన
అనధికారిక వీఐపీలకు దాదాపు చెక్
అంతరాలయానికి వెళ్లే మార్గాలన్నింటికీ తాళాలు
సాఫీగా సాగిన సామాన్యుల క్యూలైన్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్టౌన్) : అనధికార వీఐపీ దర్శనాలకు సమష్టిగా చెక్ పెట్టారు. ఓపక్క దే వదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మరోపక్క కలెక్టర్ దిల్లీరావు, ఇంకోపక్క పోలీస్ కమిషనర్ కాంతిరాణా, జేసీ నుపూర్.. దగ్గరుండి అనధికార దర్శనాలను నియంత్రిం చారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘నిర్లక్ష్యానికి నిదర్శనం’ కథనానికి స్పందించి వారు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొండపైనే ఉండి జాగ్రత్తగా పరిశీలించారు. ఇక మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే, వీఐపీ, డిజిగ్నేటెడ్ వీఐపీ క్యూల వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. దీంతో మీడియా సెంటర్ దగ్గర ఉన్న ఎంట్రీ పాయింట్ నుంచి రాజదర్శనాలు చేయించే కార్యక్రమం నిలిచిపోయింది. కలెక్టర్ దిల్లీరావు అంతరాలయ ప్రాంతంలోని అనధికార మార్గాలపై దృష్టి సారించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి ఎటుపడితే అటు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేయించారు. సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. అంతరాలయ పశ్చిమ మార్గంలో జరుగుతున్న అనధికార దర్శనాలను నిలుపుదల చేయించారు. తానే స్వయంగా గేటు దగ్గర ఉండి ఎవరు వస్తున్నారు? టికెట్లు ఉన్నాయా? ఏ రకంగా వీఐపీ? ఇలాంటి వివరాలు తెలుసుకున్నారు. ఓం టర్నింగ్ వద్ద, టోల్గేట్ మార్గంలో వాహనాలను నియంత్రించాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ కాంతి రాణా కూడా శనివారం కొండపైనే ఉన్నారు. మీడియా సెంటర్ ఎంట్రీ నుంచి డిజిగ్నేటెడ్ వీవీఐపీలు తప్ప మరెవరినీ పంపొద్దని ఆదేశించారు. పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఇలా నలుగురూ అనధికారిక దర్శనాలను నిలుపుదల చేయడంతో సామాన్యులకు దర్శనం త్వరగా పూర్తయింది.
దర్శనం 45 నిమిషాల్లోనే..
ఈ దసరా మహోత్సవాల్లో భక్తులు అమ్మ దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసే పని లేకుండాపోయింది. ఫలితంగా సామాన్య భక్తులకు మార్గం సుగమమైంది. అంతరాలయ దర్శనాలను కూడా దాదాపు నిలిపివేయటంతో క్యూలు చకచకా ముందుకు కదులుతున్నాయి. కేవలం 45 నిమిషాల్లోనే దర్శనం పూర్తవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.