పండగే పండగ..!
ABN , First Publish Date - 2022-10-02T06:09:25+05:30 IST
పండగే పండగ..!
బస్టాండ్, రైల్వేస్టేషన్లో ఒకటే రద్దీ
విద్యార్థులకు దసరా సెలవులతో ఊర్లకు పయనం
రైళ్లలోనూ రద్దీ.. 30 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటన
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లోని కళాశాలలకు ఔటింగ్ ఇవ్వటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు తమ సొంత ప్రాంతాలకు బయల్దేరారు. ఒక్కసారిగా విద్యార్థులు సొంత ప్రాంతాలకు బయల్దేరటంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) శనివారం కిటకిటలాడింది. క్లోక్రూమ్లు నిండిపోయాయి. శనివారం సాయంత్రం నాటికి మొత్తం 35 స్పెషల్ బస్సులు నడిపారు. వీటిలో రాజమండ్రి సెక్టార్కు 20 బస్సులు, విశాఖపట్నానికి మరో 15 బస్సులు నడిపారు. ఏలూరు, గుంటూరుకు పెద్దసంఖ్యలో బస్సులు నడిచాయి. హైదరాబాద్ నుంచి ఒక్కసారిగా బస్సులన్నీ వచ్చాయి. దీంతో బస్టాండ్ కిటకిటలాడిపోయింది. ఆదివారం మరిన్ని స్పెషల్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ పీఎన్బీఎస్ డీసీటీఎం బషీర్ అహ్మద్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా, రైళ్లలోనూ పండుగ ప్రయాణ రద్దీ నెలకొంది. ఆదివారం నుంచి 31వ తేదీ వరకు 30 స్పెషల్స్ నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.