Dasoju Sravan Joins BJP: బీజేపీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ మాజీ నేత దాసోజు శ్రవణ్..

ABN , First Publish Date - 2022-08-07T16:08:53+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వైఖరి మూలంగానే తాను కాంగ్రెస్‌ (T Congress) నుంచి నిష్క్రమించినట్లు చెప్పిన..

Dasoju Sravan Joins BJP: బీజేపీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ మాజీ నేత దాసోజు శ్రవణ్..

న్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వైఖరి మూలంగానే తాను కాంగ్రెస్‌ (T Congress) నుంచి నిష్క్రమించినట్లు చెప్పిన దాసోజు శ్రవణ్‌ (Dasoju Sravan) ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం పార్టీ (BJP) కండువా కప్పుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కుమ్మక్కై అధిష్ఠానానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని శ్రవణ్ ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే.


బీజేపీలో చేరిన సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవసరమని, తెలంగాణలో చికోటి ప్రవీణ్‌ లాంటి వారు ఎందరో ఉన్నారని ఆరోపించారు. చికోటి వెనక ఉన్నది మొత్తం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులేనని దాసోజు శ్రవణ్ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే విచ్చలవిడిగా దోచుకున్నారని, అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యం దారి తప్పిందని, కేసీఆర్‌ను గద్దె దించాల్సిన సమయం దగ్గరలోనే ఉందని ఆయన చెప్పారు. సుపరిపాలన కోసం రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు.



దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరడం సంతోషకరమని తరుణ్‌చుగ్‌ మీడియాకు తెలిపారు. సంక్షేమ పనులు చూసి శ్రవణ్‌ బీజేపీలో చేరారని, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనేనని తరుణ్‌చుగ్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ మోసం చేశారని, శ్రవణ్‌ చేరికతో రాష్ట్రంలో బీజేపీ బలం మరింత పెరిగిందని తెలంగాణ బీజేపీ నేత వివేక్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-07T16:08:53+05:30 IST