డీసీసీబీ వ్యాపార లక్ష్యం రూ.మూడు వేల కోట్లు
ABN , First Publish Date - 2022-07-07T06:20:37+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్పర్సన్ చింతకాయల అనిత పేర్కొన్నారు.
సొసైటీలలో కంప్యూటరీకరణ వేగవంతం చేస్తాం
బ్యాంక్ మహాజన సభలో చైర్పర్సన్ చింతకాయల అనిత
విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణయించినట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్పర్సన్ చింతకాయల అనిత పేర్కొన్నారు. బుధవారం మర్రిపాలెంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 56వ మహాజన సభలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో రూ.1,500 కోట్ల రుణాలు, అంతే మొత్తాన్ని డిపాజిట్లుగా సేకరించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు ఖరీఫ్, బంగారం, వ్యవసాయేతర రుణాలు కింద రూ.900 కోట్లు మంజూరు చేశామని వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు జిల్లాలో 98 సొసైటీల్లో పనులను వేగవంతం చేయడంతో పాటు వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1.01 కోట్ల లాభం వచ్చిందని, ప్రస్తుత ఏడాదిలో రూ.ఐదు కోట్ల లాభం ఆర్జించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సొసైటీల అధ్యక్షులు సంఘాల కార్యకలాపాలను నివేదించారు. పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా.. చైర్పర్సన్ స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహాజన సభలో డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా చినతల్లి, డీసీవో ఎండీ మిల్టన్ మాట్లాడారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రగతి నివేదిక, ఆడిట్ రిపోర్టును సీఈవో డీవీఎస్ వర్మ సమర్పించగా సభ ఆమోదించింది. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ డీజీఎం శ్రీనివాసరావు, డివిజనల్ సహకారశాఖ అధికారి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.