15 గంటలుగా నేలపై మృతదేహం... వార్డులోకి చొరబడిన కుక్కలు!

ABN , First Publish Date - 2021-09-09T16:53:29+05:30 IST

బీహార్‌లో ప్రజా ఆరోగ్యవ్యవస్థ ఎంత అధ్వాన్నంగా...

15 గంటలుగా నేలపై మృతదేహం... వార్డులోకి చొరబడిన కుక్కలు!

పట్నా: బీహార్‌లో ప్రజా ఆరోగ్యవ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉంటుందో మీడియా ద్వారా తరచూ వెల్లడవుతుంటుంది. తాజాగా ఇటువంటి ఉదంతం చర్చనీయాంశంగా మారింది. సివాన్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఉదంతం అడుగంటుతున్న మానవత్వాన్ని ప్రశ్నించేవిధంగా ఉంది. ఆసుపత్రిలో ఒక వృద్ధుని మృతదేహం 15 గంటలుగా నేలపై పడివుంది. 


దీనిని గమనించిన వీధికుక్క ఒకటి వార్డులోకి ప్రవేశించి ఆ మృతదేహం చుట్టూ తిరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వృద్ధుడిని జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వృద్దుడు మృతి చెందాడు. తరువాత ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని మంచంపై నుంచి కిందకు దించారు. 15 గంటల పాటు అదేస్థితిలో మృతదేహాన్ని వదిలివేశారు. ఇటువైపుగా వైద్యులు ఇతర సిబ్బంది తిరుగుతున్నప్పటికీ మృతదేహాన్ని పట్టించుకోలేదు. మరోవైపు ఈ మృతదేహం ఎవరిదనేది ఇంకా గుర్తించలేదు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆసుపత్రి సివిల్ సర్జన్ యదువంశ్ కుమార్ శర్మ మాట్లాడుతూ తనకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని, ఈ ఘటనకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-09-09T16:53:29+05:30 IST