డీలర్లు డీలా!
ABN , First Publish Date - 2021-01-22T05:22:01+05:30 IST
రేషన్ డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంటింటికీ బ్యియం పంపిణీ ప్రక్రియలో వలంటీర్లు చేస్తున్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తుండడంపై డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకు వ్యత్యాసం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి దారుణంగా తయారైందని వాపోతున్నారు.
వలంటీర్ల తప్పిదాలకు తమను బాధ్యులు చేస్తున్నారని ఆవేదన
సరుకు వ్యత్యాసంపై తేల్చని యంత్రాంగం
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
రేషన్ డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంటింటికీ బ్యియం పంపిణీ ప్రక్రియలో వలంటీర్లు చేస్తున్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తుండడంపై డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకు వ్యత్యాసం విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి దారుణంగా తయారైందని వాపోతున్నారు. జిల్లాలో 2,065 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ డీలర్ల ద్వారానే కార్డుదారులకు సరుకుల పంపిణీ జరిగేది. క్వింటాకు రూ.100 వంతున కమీషన్ ఇచ్చేవారు. లబ్ధిదారుని కుటుంబంలో ఎవరిదో ఒకరిది వేలిముద్ర తీసుకొని సరుకులు అందజేసేవారు. వైసీపీ ప్రభుతం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నాణ్యమైన బియ్యం ఇంటింటా పంపిణీని ప్రారంభించింది. ఇందుకు జిల్లానే పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. ఇక్కడే డీలర్లకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వలంటీర్ల వద్ద సరుకులు... డీలర్ల వద్ద బయోమెట్రిక్ యంత్రాలు ఉంటున్నాయి. డీలర్ల వద్ద సరుకుల నిల్వలో ఈపాస్ యంత్రాలలో (క్లోజింగ్ బ్యాలెన్స్) వ్యత్యాసం కనిపిస్తోంది. పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు రేషన్ డీలర్ల వద్ద తనిఖీలు నిర్వహించే సందర్భంలో సరుకు నిల్వల్లో తేడాలు వస్తే, కేసులు బనాయిస్తున్నారు. దీనికి భయపడుతున్న డీలర్లు.. వలంటీర్లకు సరుకులు ఇచ్చేందుకు కొన్నిచోట్ల నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మరో ముందడుగేసి జిల్లాలో మినీ ట్రక్కుల ద్వారా సరుకులు ఇంటింటికీ పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం లబ్ధిదారులను ఎంపిక చేసింది. అర్హులందరికీ గురువారం మినీ ట్రక్కుల వాహనాలను పంపిణీ చేసింది. వలంటీర్లతో కాకుండా ఇకపై వ్యాన్(మినీ ట్రక్కు) డ్రైవర్తో మళ్లీ డీలర్లను సమన్వయం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో వలంటీర్లతో అనేక ఇబ్బందులు పడ్డామని, సరుకు నిల్వల్లో తేడాలు వచ్చాయని, ఇప్పుడు వ్యాన్ డ్రైవర్లతో సరుకుల పంపిణీ అంటే మళ్లీ సమస్యలు తప్పవని డీలర్ల సంఘ నేతలు అంటున్నారు. డీలర్ల వద్ద స్టాకు వ్యత్యాసం వస్తే, వెంటనే కేసులు పెడుతున్న అధికారులు.. వలంటీర్లు చేసే తప్పులపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ల ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసినా, తమకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని రేషన్ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.