వివాహిత అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-12-04T02:18:46+05:30 IST
కుటుంబ కలహాలు, భర్త వేధింపులతో వినుకొండ జ్యోతిక (30) అనే వివాహిత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.
కావలి రూరల్, డిసెంబరు 3 : కుటుంబ కలహాలు, భర్త వేధింపులతో వినుకొండ జ్యోతిక (30) అనే వివాహిత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన కావలి తుఫాన్నగర్లో జరిగింది. పోలీసుల కథనం మేరకు, తుఫాన్నగర్కు చెందిన రవితో బోగోలు మండలం జువ్వలదిన్నెకు చెందిన జ్యోతికకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బార్బర్ షాపు నిర్వహించే రవి ఉదయం 6 గంటలకు షాపునకు వెళ్లిన అనంతరం జ్యోతిక ఇంట్లోని బాత్రూమ్లో చీరతో ఉరివేసుకుంది. ఈ విషయాన్ని జ్యోతిక పిల్లలు గుర్తించి పక్కింటి వారికి తెలిపారు. వారు భర్త రవికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన రవి మృతదేహన్ని కిందకు దించి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆమె పుట్టింటి వారికి సమాచారం ఇచ్చారు. దీంతో మృతురాలి తల్లి ఆదిలక్ష్మి, కుటుంబ సభ్యులు వచ్చారు. అనుమానంతో జ్యోతికను భర్త రవి వేధించేవాడని, ఆ వేధింపులకు తాళలేక ఆమె మృతి చెందిందని అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలికి కుమార్తె సోనియా(11), కుమారుడు వినయ్(6)లు ఉన్నారు.. రెండో పట్టణ సీఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ అరుణకుమారి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
----------