అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-08-16T06:53:43+05:30 IST
పెదవాల్తేరు శివాజీపాలెం రామరాజు లేఅవుట్స్ డాక్టర్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ పైనుంచి పడి యువకుడు మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడు ఒడిశా మాజీ ఎమ్మెల్యే తనయుడు
విశాఖపట్నం, ఆగస్టు 15: పెదవాల్తేరు శివాజీపాలెం రామరాజు లేఅవుట్స్ డాక్టర్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ పైనుంచి పడి యువకుడు మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘటనపై ఎంవీపీ జోన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ. ఈ అపార్టుమెంట్లో ఒడిశా మాజీ ఎమ్మెల్యే జన్నీ తమిని గమాంగో ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. ఆమె పెద్దకుమారుడు తన్మయి గమాంగో(21) పంజాబ్లో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
గతనెలలో పంజాబ్ నుంచి తల్లి వద్దకు విశాఖ వచ్చాడు. సోమవారం తెల్లవారు జామున తన్మయి సమీపంలో ఉన్న మరో అపార్టుమెంట్కు వెళ్లాడు. ఇది గమనించిన ఆపార్టుమెంట్ వాసులు దొంగలు ఎవరో వచ్చారంటూ పెద్దగా అరవడం, అదే సమయంలో తన్మయి అపార్టుమెంట్ నుంచి కిందపడటంతో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందడంతో ద్వారకా ఏసీసీ మూర్తి, ఎంవీపీ జోన్ సీఐ ప్రసాద్లు సంఘటన స్థలం వద్దకు వచ్చి పరిశీలన జరిపారు. ఎంవీపీ జోన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.