అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-26T07:53:11+05:30 IST
అప్పుల బాధ తాళలేక ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.అప్పులు తీర్చే మార్గం కనపడక ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు.
బుచ్చినాయుడుకండ్రిగ, మే 25: అప్పుల బాధ తాళలేక ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆయన కుటుంబ సభ్యుల కథనం మేరకు..బుచ్చినాయుడుకండ్రిగ మండలం నెలవాయి దళితవాడకు చెందిన పోలూరు వెంకటేశు(49) తనకున్న మూడు ఎకరాల్లో నాలుగేళ్లుగా వరి, వేరుశెనగ సాగుచేశాడు.పంటలు సక్రమంగా పండకపోవడంతో సాగుకోసం చేసిన అప్పులు తీరలేదు. మరో వైపు కుమార్తెకు వివాహం చేశాడు. దీంతో వడ్డీలతో కలిపి అప్పులు రూ. 12లక్షలకు చేరాయి. తీర్చే మార్గం కనపడక ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. స్థానికులు గుర్తించి శ్రీకాళహస్తి ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.