గంటల వ్యవధిలోనే దోపిడీ కేసు ఛేదింపు
ABN , First Publish Date - 2021-12-14T17:36:04+05:30 IST
దోపిడీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బళ్లారి పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారు జామున 5.15 గంటల సమయంలో నగరంలోని మోతి సర్కిల్లో జరిగిన దోపిడీ
- తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు
- నలుగురు నిందితుల అరెస్టు
- రూ. 41 లక్షల నగదు స్వాధీనం
బళ్లారి(బెంగళూరు): దోపిడీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బళ్లారి పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం తెల్లవారు జామున 5.15 గంటల సమయంలో నగరంలోని మోతి సర్కిల్లో జరిగిన దోపిడీ ఘటనను కొన్ని గంటల వ్యవధిలోనే బ్రూస్పేట పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ సైదుల్లా అదావత్ తెలిపారు. దోపిడికి కారణమైన నిందుతులను అరెస్టు చేయడంతో వారి నుంచి రూ. 41 లక్షలు బ్రూస్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. సోమవారం తెల్లవారు జామున బళ్లారి నగరానికి చెందిన వీకే బంగారు నగల షాపులో పనిచేస్తున్న మహబూబ్బాష రూ. 41 లక్షలను బెంగళూరుకు వెళ్లే నిమిత్తం మోటారు సైకిల్పై బస్టాండుకు వెళుతుండగా, మోతి సర్కిల్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు మహబూబ్ బాష వెళుతున్న మోటారు సైకిల్ ఆపి బెదిరించి వారి వద్ద ఉన్న రూ. 41 లక్షలను లాక్కొని వెళ్లిపోయారు. ఈ మేరకు 10 గంటల సమయంలో నగల వ్యాపారి బ్రూస్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే బ్రూస్పేట పీఎస్ఐ ఆర్ నాగరాజు, అపరాధ విభాగం సిబ్బంది సర్దార్ ముజాహిద్ అలి, బీ ఉమేష్ రెడ్డి, కానిస్టేబుల్ అయ్యప్ప, గురుబసవరా జు, గోరంటి, శివరాజ్ కేసును వేగంగా దర్యాప్తు చేపట్టి కొన్ని గంటల వ్యవధిలోనే దోపిడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. బజాజ్ పల్సర్ మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బళ్లారి నగరానికి చెందిన బండిమోటు నివాసి ఆసాద్, కోట ప్రాంతానికి చెందిన వెంకటేష్, గుగ్గర హట్టి ప్రాంతానికి చెందిన రసూల్, కౌల్ బజార్ ప్రాంతంలోని జాగృతి నగర్ నివాసి ధరవేశ్ను అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.