కుక్కల దాడిలో జింక మృతి
ABN , First Publish Date - 2022-05-22T06:04:37+05:30 IST
కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందగా, మరో నాలుగు జింకలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి.
తుర్కపల్లి, మే 21: కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందగా, మరో నాలుగు జింకలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని గంధమల్ల గ్రామానికి సమీపంలో సిద్ధిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దావులాపూర్ అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో జింకల సంచారం అధికంగా ఉంటుంది. శనివారం ఉదయం ఐదు జింకలు గ్రామ సమీపంలోకి రాగా, వాటిని చూసిన కుక్కలు వెంబడించాయి. వాటిలో ఓ జింక గ్రామంలోకి పరుగులు తీసి గ్రామానికి చెందిన వేముల భాను ఇంటి వరండాలోకి వచ్చింది. దీన్ని స్థానికులు సెల్ఫోన్లో వీడియో తీశారు. మరో నాలుగు జింకలు కుక్కలు వెంబడించడంతో వాటికి దొరకకుండా గ్రామ సమీపంలో ఉన్న వీరారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. గ్రామంలో భాను ఇంట్లోకి వచ్చిన జింక, బయటకు పరుగులు తీయడంతో కుక్కలు వెంబండించి దాడిచేశాయి. కుక్కలు తీవ్రంగా దాడిచేయడంతో జింక మృతి చెందింది. గ్రామస్థుల సమాచారం మేరకు దత్తాయపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్, వీరారెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ రాజశేఖర్ గ్రామాన్ని సందర్శంచి మృతి చెందిన జింక కళేబరానికి పంచనామా నిర్వహించారు. వేసవి కారణంగా తాగు నీటికోసం గంధమల్ల గ్రా మసమీపంలోకి జింకలు వచ్చి ఉండ వచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.