కామాంధుడిని చెప్పులు పట్టించాయ్!
ABN , First Publish Date - 2022-05-12T10:07:53+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట శివారులో గిరిజన మహిళపై హత్యాచారం ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు.
గిరిజన మహిళ హత్యాచారం మిస్టరీని ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్ట్
చౌటుప్పల్ రూరల్, మే 11: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట శివారులో గిరిజన మహిళపై హత్యాచారం ఘటన మిస్టరీని పోలీసులు ఛేదించారు. మహిళపై దారుణానికి పాల్పడిన నిందితుడిని అక్కడ అతడు వదిలి వెళ్లిన చెప్పులు పట్టించాయి! కేసు వివరాలను చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీశ్ గౌడ్ (25) అవివాహితుడు. 15 రోజులక్రితం చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటకు వచ్చాడు. అక్క డే తాపీ మేస్త్రీ పని చేస్తూ ఓ డెయిరీ లేబర్ క్యాంప్ గదుల్లో అద్దెకు ఉంటున్నాడు. హరీశ్ గౌడ్ ఉంటున్న గదులకు సమీపంలోనే ఓ మూతబడిన గోదాము ఉంది. నాగల్కర్నూల్ జిల్లా కోడూర్ మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ (28), తన భర్తతో కలిసి ఆ గోదాములో ఉంటున్నారు. అక్కడే భార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. భర్త సమీపంలోని ఓ కాలేజీలో సెక్యూరిటీ గార్డుగానూ పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సాయంత్రం ఆరు గంటలకు ఆమె భర్త లేని సమయంలో హరీశ్ గౌడ్.. గోదాం ప్రహరీ దూకి లోపలికి వెళ్లాడు. వివాహితపై అఘాయిత్యానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో కర్రతో ఆమె తలపై కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళ అతడి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి పట్టుకున్నాడు. పెద్ద మొద్దుతో ఆమె తలపై కొట్టడంతో తీవ్ర గాయమె అక్కడిక్కడే మృతిచెందింది. అనంతరం మృతదేహంపైనా అత్యాచారం జరిపాడు. తర్వాత మృతదేహంపై ఉన్న బంగారు పుస్తెలు, వెండి కాళ్ళ పట్టీలు, వెండి మట్టెలు తీసుకుని అక్కడినుంచి పరారయ్యాడు.
ఏమీ తెలియనట్లు పనికివెళ్లిన నిందితుడు
ఈ హత్య కేసు విచారణకు ఏసీపీ ఉదయ్రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. గోదాం సమీపంలో నిందితుడు వదిలివెళ్లిన చెప్పులను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వాటికి సిమెంటు ఉండటంతో డెయిరీ లేబర్ రూంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నించారు. నిందితుడు హరీశ్గౌడ్ ఏమీ తెలియనట్లు పనికి వచ్చాడు. చెప్పుల్లేకుండా రావడంతో ఘటనాస్థలిలోని చెప్పులు హరీశ్గౌడ్వేనని నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా నల్లగొండ జైలుకు రిమాండ్ చేశారు.