నారాయణది ముమ్మాటికి హత్యే

ABN , First Publish Date - 2022-06-26T04:49:37+05:30 IST

నెల్లూరు రూరల్‌ మండలం కందమూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు ఉదయగిరి నారాయణది ముమ్మాటికీ హత్యేనని తమ నిజనిర్ధారణలో తేలిందని బహుజన సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు జానకి ప్రసాద్‌ తెలిపారు.

నారాయణది ముమ్మాటికి హత్యే
విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నాయకులు

నెల్లూరు (వీర్సీ) జూన్‌ 25 : నెల్లూరు రూరల్‌ మండలం కందమూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు ఉదయగిరి నారాయణది ముమ్మాటికీ హత్యేనని తమ నిజనిర్ధారణలో తేలిందని బహుజన సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు జానకి ప్రసాద్‌ తెలిపారు. నగరంలోని అంబేద్కర్‌ భవన్‌లో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  నారాయణపై పోలీసులు తప్పుడు కేసును పెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతోనే అతను మృతి చెందాడని, పోలీసులు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పొదలకూరు ఎస్‌ఐ కరిముల్లా, జగదేవిపేటకి చెందిన గోనుగుంట వంశీనాయుడు చేసిన హత్యేనని తమ విచారణలో తేలిందని తెలిపారు. మృతుడి భార్యని బెదిరించి తప్పుడు వాంగ్మూలం రికార్డు  చేశారని ఆరోపించారు. నారాయణ హత్యకు కారకులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి బి. శ్రీరామ్‌, నాయకులు కె.అశోక్‌, పుష్పాంజలి, పెంచలప్రసాద్‌, ఇండ్ల శివయ్య, తదితరులు పాల్గొన్నారు. 

నారాయణ మరణంలో అన్నీ అనుమానాలే : సీపీఎం 

నెల్లూరురూరల్‌ : కందమూరు గ్రామంలో ఉదయగిరి నారాయణ బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో ఆది నుంచి  అన్నీ అనుమానాలేనని  సీపీఎం మండల కార్యదర్శి ఆలూరు తిరుపాలు ఆరోపించారు. శనివారం గ్రామంలో నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణపై పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్రిక్స్‌ కర్మాగారం యజమాని వంశీనాయుడుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బలవన్మరణానికి దారితీసిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. నారాయణపై పోలీసులు జరిపిన దాష్టీకం పైనా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మట్టేంపాడులో ఇంటింటికి సీపీఎం కార్యాక్రమం నిర్వహించారు. 

Updated Date - 2022-06-26T04:49:37+05:30 IST